సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నర్మదా బచావో ఉద్యమకారిణికి బిగ్ రిలీఫ్ వచ్చినట్లైంది.
నర్మదా బచావో ఉద్యమ నేత మేధా పాట్కర్కు విధించిన ఐదు నెలల సాధారణ జైలు శిక్షను ఢిల్లీ కోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. 23 ఏళ్ల క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గుజరాత్లోని ఎన్జీవోకు నేతృత్వం వహించిన పరువు నష్టం కేసులో మేధా పాట్కర్కు జూలైలో శిక్ష పడింది. దీంతో ఆమె శిక్ష రద్దు చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తాజాగా కోర్టు.. శిక్షను సస్పెండ్ చేస్తూ.. 25,000 పూచీకత్తుపై పాట్కర్కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సెప్టెంబర్ 4న సమాధానం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ఎల్జీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
జూలై 1న ఢిల్లీ కోర్టు మేధా పాట్కర్కు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. సక్సేనాకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును వెల్లడిస్తూ.. పాట్కర్ వయస్సు, అనారోగ్యం పరిగణనలోకి తీసుకుంటే ఇది కఠినమైన శిక్ష కాదు అని కోర్టు పేర్కొంది.
పరువు నష్టం కేసు జనవరి 2001 నాటిది. నవంబర్ 25, 2000న ‘ట్రూ ఫేస్ ఆఫ్ పేట్రియాట్’ పేరుతో పాట్కర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో అహ్మదాబాద్కు చెందిన ఎన్జీవోకి నాయకత్వం వహించిన వీకే. సక్సేనాను ‘పిరికివాడు’ అంటూ సంభోదించారు. అలాగే హవాలా లావాదేవీల్లో సక్సేనా ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆ సమయంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా భారీ నిరసనలకు నాయకత్వం వహించారు. దీని తర్వాత ఒక టీవీ ఛానెల్లో తన గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటనను జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్పై సక్సేనా రెండు కేసులు పెట్టారు. పరువుకు నష్టం కలిగించేలా పాట్కర్ వ్యవహరించారని ఆరోపించారు. మే 2024లో న్యాయస్థానం ఈ కేసులో పాట్కర్ను దోషిగా నిర్ధారించింది. ఆమె చర్యలు ఉద్దేశపూర్వకంగా.. దురుద్దేశపూర్వకంగా.. సక్సేనా ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవి ధర్మాసనం పేర్కొంది.