కరోనాకు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషనే అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుంచి భారత్లో వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని భావించినా.. డోసుల కొరతతో.. గతంలో కంటే వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంలోని మోడీ సర్కార్ను టార్గెట్ చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. రోజు రోజుకూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. సర్కార్ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్ 2తో పోలిస్తే ఇటీవల రోజూ ప్రజలకు వేసే వ్యాక్సిన్ల సంఖ్య తగ్గుతోందంటూ.. దానికి సంబంధించిన డేటాను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిదంబరం… ఏప్రిల్ 2న రోజుకు 42 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్తే… అదే ఈ శుక్రవారం నాటికి 11.6 లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. ప్రతి రోజూ వ్యాక్సినేషన్ సంఖ్య ఎందుకు తగ్గుతుందని ఫైర్ అయ్యారు.