Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత, శుక్రవారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపెడుతోంది.
Read Also: MK Stalin: కర్ణాటక ఓటమిని కప్పిపుచ్చడానికే రూ.2000 నోట్ల రద్దు..
సారంగ్ తాను చనిపోయినా కూడా అవయవదానంతో మరో 6 మందిని బ్రతికించాడు. కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి ఫలితాలను ప్రకటిస్తూ సారంగ్ కు నివాళులు అర్పించారు. గ్రేస్ మార్కుల సహాయం లేకుండానే సారంగ్ పూర్తి A ప్లస్ స్కోర్ సాధించగలిగాడని మంత్రి భావోద్వేగానికి గురయ్యాడు. యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అభినందించారు. సారంగ్ రెండు కిడ్నీలు, లివర్, గుండె వాల్వులు, కళ్లను దానం చేసినట్లు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
అట్టింగల్ లోని ప్రభుత్వ బాలుర హెచ్ఎస్ఎస్ చదువుతున్న సారంగ్ మే 13న మద్యాహ్నం కల్లంబలం-నగరూర్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. మరో వాహనానికి దారివ్వాలనే తపనలో సారంగ్ ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన సారంగ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో అతని అవయవాలను దానం చేశారు.