మధ్యప్రదేశ్లో న్యాయవాది అర్చన తివారీ (29) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 7 నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మూడు పోలీస్ బృందాలు ఆమె కోసం జల్లెడ పడుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్హౌస్లో ట్రంప్-జెలెన్స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
అర్చన తివారీ.. సివిల్ జడ్జి పదవికి సిద్ధపడుతోంది. ఆగస్టు 7న ఇండోర్ నుంచి కట్నికి వెళ్లడానికి బయల్దేరింది. ఆగస్టు 7న మధ్యాహ్నం 2:20 గంటలకు హాస్టల్ నుంచి అర్చన తివారీ ఇండోర్ రైల్వేస్టేషన్కు బయల్దేరింది. సాయంత్రం 4:10 గంటలకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్ప్రెస్(18233) ఎక్కింది. ఏసీ కోచ్ బీ-3 సీటు దగ్గర కూర్చుంది. ఇది తలుపు దగ్గర ఉంది. రైలు భోపాల్ సమీపంలోకి వచ్చినప్పుడు అర్చన తివారీ తన తల్లితో ఫోన్లో సంభాషించింది. అప్పుడు రాత్రి 10:16 గంటలు అయింది. ఇక ఆగస్టు 8న నర్మదా ఎక్స్ప్రెస్ ఉదయం 6:50 గంటలకు కాట్నీ సౌత్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. కానీ అర్చన మాత్రం స్టేషన్లో దిగలేదు. సీటుపై మాత్రం ఆమె బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో మూడు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి.
భోపాల్-నర్మదాపురం ఏం జరిగింది
నర్మదా ఎక్స్ప్రెస్ రాత్రి 10:05 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరింది. రాత్రి 11:26 గంటలకు నర్మదాపురం చేరుకుంటుంది. భోపాల్ నుంచి నర్మదాపురం చేరుకోవడానికి గంట 21 నిమిషాలు పడుతుంది. ఈ గంట 21 నిమిషాల్లో ఏం జరిగింది అనేది సస్పెన్ష్గా మారింది. అయితే రైలు మిడ్ఘాట్లోని దట్టమైన అడవి గుండా రైలు వెళ్తుంది. చాలాసార్లు పులులు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులపై దాడి చేసిన సందర్భాలున్నాయి. అర్చన సీటు కూడా తలుపు దగ్గరే ఉంది. వాష్రూమ్కు వెళ్లే సమయంలో ఏమైనా పులి ఏదైనా దాడి చేసిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: పుతిన్-జెలెన్స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన
ఇక నర్మదాపురం వరకు అర్చన ఫోన్ సిగ్నల్ వచ్చింది. ఒకవేళ నదిలో గానీ పడి ఉండొచ్చేమోనని నదిలో కూడా గజ ఈతగాళ్లతో కూడా గాలిస్తున్నారు. లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఒకవేళ కిడ్నాప్ చేస్తే.. తోటి ప్రయాణికులు అప్రమత్తం అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆరోజు రైలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. కనుక అలాంటిది జరిగి ఉండదేమోనని భావిస్తున్నారు. ఇంకా లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారం కారణంగా తల్లిదండ్రులకు తెలియకుండా అదృశ్యమైందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్చన ఫోన్ సమాచారాన్ని సేకరించగా.. ఏ అబ్బాయితోనూ ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు కూడా కనిపించలేదు.
ప్రస్తుతం ఇండోర్ నుంచి కాట్నీ రైల్వే స్టేషన్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే అర్చన బ్యాగ్ మాత్రం సీటు దగ్గరే కనుగొన్నారు. ఇక హాస్టల్లో ఎవరితోనో ఎక్కువగా మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహచరులను, హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బంధువుల్లో ఆందోళన ఎక్కువ అయిపోతుంది. అర్చనకు ఏమైనా జరిగిందా? అనే ఆందోళన మొదలైంది.