Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన అజిత్ పవార్ విమాన ప్రమాదంపై తాజాగా ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, ఇందులో కుట్ర కోణం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. అజిత్ పవార్ను విమాన ప్రయాణానికి బలవంతం చేశారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో భావోద్వేగంగా మాట్లాడిన రోహిత్ పవార్.. ఈ ప్రమాదం నిజంగా యాదృచ్ఛికమా..? లేక వెనుక ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. ప్రమాదం తర్వాత లభించిన కాలిపోయిన స్వెటర్, వాచ్, చెప్పులు ఇప్పటికీ అందరినీ కలచివేస్తున్నాయని తెలిపారు. అజిత్ పవార్ ఇక లేరనే విషయాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారని అన్నారు.
విమాన ప్రయాణానికి ముందు అనుమానాస్పద ఘటనలు
విమాన ప్రయాణానికి ముందు జరిగిన సంఘటనల టైమ్లైన్ను రోహిత్ పవార్ వివరించారు. ఉదయం 7:02 గంటలకు సిబ్బంది అక్కడ ఉన్నారని, 7:03కి విజిబిలిటీ చెక్ చేశామని, 7:10కి అన్నీ బాగున్నాయని ప్రకటించారని తెలిపారు. అయితే అజిత్ పవార్ మాత్రం ఉదయం 7:50కి విమానాశ్రయానికి చేరుకున్నారని, విమానం ఉదయం 8:10కి బయలుదేరిందని చెప్పారు. అసలు 7:00కి బయలుదేరాల్సిన విమానం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. అజిత్ పవార్ ముందురోజే రోడ్డు మార్గంలో బారామతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. చివరి నిమిషంలో ఒక సీనియర్ నేత రావడం, కొన్ని అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయాల్సి రావడంతో పరిస్థితి మారిందని, ఆ తర్వాతే విమాన ప్రయాణం నిర్ణయమైందని అన్నారు.
విమానం, పైలట్లు, సాంకేతిక లోపాలపై ప్రశ్నలు
ప్రమాదానికి రెండు రోజుల ముందు ఆ విమానం సూరత్కు వెళ్లిందని, దీన్ని ‘మెయింటెనెన్స్ ఫ్లైట్’గా పేర్కొన్నారని తెలిపారు. కానీ ప్రమాదానికి ముందు విమానం శబ్దం అసాధారణంగా ఉందని స్థానిక మహిళ ఒకరు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ సీసీటీవీ ఫుటేజ్లో విమానం గాల్లో 360 డిగ్రీలుగా తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయని తెలిపారు. విమానం సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా..? ఎయిర్వర్తినెస్ రిపోర్టులు, టెక్నికల్ లాగ్స్ ఎక్కడ..? హ్యాంగర్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ట్రాన్స్పాండర్ ఆఫ్.. పైలట్ మౌనం అనుమానాస్పదం
ప్రమాదానికి ఒక నిమిషం ముందు విమానం ట్రాన్స్పాండర్ ఆఫ్ అవ్వడం అనుమానాస్పదమని రోహిత్ పవార్ అన్నారు. కో-పైలట్ ‘ఓహ్ షిట్’ అంటూ స్పందించినా, ప్రధాన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరింత సందేహాలకు దారితీస్తోందని చెప్పారు. ఆయన నిద్రలో ఉన్నారా..? లేక ఇది ముందే పన్నిన ప్రణాళికనా..? అని ప్రశ్నించారు. కెప్టెన్ కపూర్ గతంలో “డ్రంకెన్ పైలట్ లిస్ట్”లో ఉన్నారని, చివరి నిమిషంలో పైలట్లను మార్చారని ఆరోపించారు. అసలు నియమించాల్సిన పైలట్లు ఎందుకు రాలేదని, వారిపై బ్రెత్ అనలైజర్ పరీక్షలు జరిగాయా అని ప్రశ్నించారు.
DGCA నివేదికలో సమయానికి సంబంధించి 20 సెకన్ల వ్యత్యాసం ఉందని, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగడం లేదని విమర్శించారు. VSR విమానయాన సంస్థకు DGCA నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. బ్లాక్ బాక్స్ పూర్తి రికార్డింగ్ను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ ప్రమాదం కుట్ర కాదని శరద్ పవార్ మొదట్లో చెప్పిన మాటలపై స్పందించిన రోహిత్ పవార్.. ఆ సమయంలో లభ్యమైన సమాచారం మేరకే ఆ వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు కొత్త ఆధారాలు బయటపడుతున్నాయని అన్నారు. తాను ఎవరినీ నేరుగా నిందించడం లేదని, కానీ ప్రతి కోణంలో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. అయితే, అజిత్ పవార్ తనకు ఒకసారి “నమ్మకమైన హెలికాప్టర్ లేదా సొంత విమానం ఉండాలి” అని చెప్పారని రోహిత్ పవార్ వెల్లడించారు. అప్పట్లో ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదని, ఇప్పుడు ఈ ఘటనలన్నింటిని చూస్తే అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.