Landslides: ఇండియాలో ఈ మధ్య కాలంలో నైరుతిరుతుపవనాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. భారీ వర్షాలతోపాటు వరదలు సైతం ఈ రాష్ట్రాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు, వరదలు తమ ప్రతాపాన్ని చూపాయి. సోమవారం హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పక్కనే ఉన్న ఆలయంపై పడ్డాయి. దీంతో దేవాలయానికి వచ్చిన వారిలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Read also
ఎడతెరపి లేకుండా కురుస్తు్న్న భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం శిమ్లా లోని ఓ ఆలయం పై కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల ధాటికి ఆలయం కుప్పకూలింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయంపై కొండి చరియలు పడిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వర్ష పరిస్థితుల దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను సీఎం సూచించారు.
Read also:
పలు ప్రాంతాల్లోనూ వర్ష సంబంధిత ఘటనల్లో మరణాలు సంభవించాయి. హిమాచల్లో 24 గంటల వ్యవధిలోనే 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సఖ్వీందర్ సింగ్ తెలిపారు. ఆదివారం సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో శిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.