Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదులు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని కాశ్మీర్ జోన్ పోలీస్ ఏడీజీపి విజయ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 26న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
Read Also: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
అంతకుముందు బుధవారం శ్రీనగర్ లోని 15 కార్ఫ్స్ కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. కాశ్మీర్ లో విదేశీ ఉగ్రవాదుల పాత్ర గురించి చర్చించారు. స్థానిక రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోవడంతో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 46 మంది ఉగ్రవాదులను మట్టుబెడితే.. ఇందులో 37 మంది పాకిస్తానీయులు కాగా.. 9 మంది స్థానికులు ఉన్నారు. 33 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద చరిత్రలో ఒక ఏడాదిలో స్థానిక ఉగ్రవాదుల కన్నా విదేశీ ఉగ్రవాదులు నాలుగు రెట్లు చనిపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 130 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారనరి, వీరిలో సగం మంది పాకిస్తాన్ కి చెందిన వారే అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.