తమిళ్, తెలుగు సినిమాల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశాల్ మరోసారి తన రిస్కీ సీన్లతో చర్చల్లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్లో ఎన్ని సార్లు గాయపడినా, స్టంట్స్ చేయడం మానలేదని చెప్పారు. విశాల్ యాక్షన్ ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. పందెం కోడి, భీమా, పయన్, అభిమన్యుడు, లాఠీ, మార్క్ ఆంటోనీ వంటి సినిమాల్లో ఆయన చేసిన ఫైట్ సీన్స్కి ప్రత్యేక ఫ్యాన్బేస్ ఉంది. ప్రతి సినిమాలో కొత్త యాక్షన్ డిజైన్, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ వస్తున్నాడు.
Also Read : Athiradi : ‘అతిరథి’ టైటిల్ టీజర్ అవుట్.. టొవినో, బేసిల్ జోసెఫ్ల నుంచి సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ రెడీ !
అయితే విశాల్ మాట్లాడుతూ.. “నా శరీరంపై ఇప్పటివరకు 119 కుట్లు పడ్డాయి. చాలా సార్లు గాయపడ్డాను. కానీ, నేను చేసిన యాక్షన్ సీన్స్కి ప్రేక్షకులు ఇచ్చే స్పందన చూసి ఆ బాధ అన్నీ మర్చిపోతాను. సినిమాల్లో డూప్ వాడటం నాకు ఇష్టం లేదు. నేను నటించే యాక్షన్ సీన్స్ని నేనే చేయడం కిక్ ఇస్తుంది. సినిమా అంటే యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయి ఉండాలి. నేను చేసే స్టంట్స్ రియలిస్టిక్గా ఉండాలని కోరుకుంటాను. అందుకే డుబ్ అవసరమని అనిపించినా, చాలాసార్లు నేనే చేస్తాను. ప్రమాదం జరుగుతుందనే భయం ఉండదు, కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం తప్పకుండా తీసుకుంటాం. అయినప్పటికి ఎన్నో సార్లు ప్రమాదాలు ఎదుర్కొన్నా. ఒక సినిమాలో బైక్ స్టంట్ షూట్ సమయంలో కిందపడి కాలు ఫ్రాక్చర్ అయింది. మరోసారి గ్లాస్ యాక్షన్ సీన్లో చేతికి లోతైన గాయం కావడంతో 17 కుట్లు వేయాల్సి వచ్చింది. కానీ ప్రేక్షకుల కోసం చేస్తున్నపుడు ఆ బాధలు అన్నీ చిన్నవి గా అనిపిస్తాయి” అంటూ విశాల్ చిరునవ్వుతో అన్నారు.
ఇక విశాల్ ఫ్యాన్స్ మాత్రం “అంత రిస్క్ ఎందుకండి అన్నా! మీ సేఫ్టీ ముందు ముఖ్యం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ విశాల్ మాత్రం తన స్టైల్ మార్చే ప్రసక్తే లేదంటున్నాడు. “సినిమా అంటే ప్యాషన్.. నేను చేసే స్టంట్ ఒక్కటి కూడా ఫేక్గా అనిపించకూడదు.. అందుకే డూప్లు వద్దు” అంటున్నాడు ఈ యాక్షన్ మాన్. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం థూప్పరి వాలాన్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని టాక్. అలాగే ఆయన ప్రొడక్షన్లో మరో చిత్రం కూడా ప్రారంభం కానుంది.