తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల అశోక్ తేజ కలం ఇప్పటికీ బలంగానే సాగుతోంది.
సుద్దాల అశోక్ తేజ 1960 మే 16న తెలంగాణలోని గుండాల మండలం, సుద్దాల గ్రామంలో జన్మించారు. తండ్రి హనుమంతు పాటతోనే అశోక్ తేజ బతుకు బాట కూడా సాగింది. చదువుతో పాటు లోకాన్నీ చదవగలిగే శక్తి తండ్రివల్లే లభించింది అంటారు అశోక్ తేజ. బడిపంతులుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే, తన మనోభావాలను పాటల రూపంలో పదిలపరచుకొనేవారు అశోక్ తేజ. ఆయన అక్క కుమారుడు ఉత్తేజ్ నటునిగా చిత్రసీమలో కొనసాగుతూ ఉన్నారు. ఉత్తేజ్ తన మేనమామను కొందరు సినీ దర్శకులకు పరిచయం చేశారు. తొలుత కె.రంగారావు ‘నమస్తే అన్న’ సినిమాలో “నైజామ్ పోరి…” అని సాగే పాట రాశారు అశోక్ తేజ. తరువాత దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం అయ్యారు. సుద్దాల అశోక్ తేజలోని కవిత్వం కృష్ణవంశీకి భలేగా నచ్చేసింది. తన రెండో సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’లో తొలిసారి అశోక్ తేజతో పాట రాయించుకున్నారు కృష్ణవంశీ. ఆ తరువాత నుంచీ అశోక్ తేజను కృష్ణవంశీ ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే తీరున దాసరి నారాయణరావు కూడా తన సినిమాలలో సుద్దాల పాటకు చోటు కల్పిస్తూ సాగారు. వీరి ప్రోత్సాహంతో సుద్దాల అశోక్ తేజ తనదైన బాణీ పలికించారు. అశోక్ తేజ సాహిత్యంలోని గుబాళింపు పలువురిని ఆకట్టుకుంది. అలా అందరి ప్రోత్సాహంతో సుద్దాల పాట చిత్రసీమలో చిందులు వేసింది. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గేయరచయితగా నిలచిన తెలుగువారు సుద్దాల అశోక్ తేజ. ‘ఠాగూర్’లో ఆయన రాసిన “నేను సైతం…” పాట ఆయనను జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలిపింది.
సుద్దాల అశోక్ తేజ పాటల్లో సహజత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అదే పనిగా కవిత్వం పలికించినట్టు అనిపించదు. అలతి అలతి పదాలతోనే మనసులను తాకే రచన సాగించడం సుద్దాల అశోక్ తేజ బాణీ అని చెప్పవచ్చు. ఆయన రాసిన అనేక గీతాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. ఈ మధ్య కాలంలో అశోక్ తేజ ‘ఫిదా’లో రాసిన “వచ్చిండే… పిల్లా మెల్లగా వచ్చిండే…” పాట విశేషాదరణ చూరగొంది. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’లోనూ సుద్దాల అశోక్ తేజ రెండు పాటలు పలికించారు. కథలో ఎంతో కీలకమైన ఆ రెండు పాటల్లోనూ సుద్దాల తనదైన ముద్ర వేశారు. ఆరంభంలో వినిపించే “కొమ్మా ఉయ్యాల…”, సినిమాలోని అన్ని పాటల్లోకీ తలమానికంగా నిలచిన “కొమురం భీముడో…” పాటనూ సుద్దాల కలమే అందించింది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ చూసిన వారందరూ “కొమురం భీముడో…” పాటకు ఫిదా అయిపోయారు. సుద్దాల అశోక్ తేజ పాటకు తగ్గ బాణీలను కీరవాణి పలికించారు. అందుకు తగ్గ అభినయాన్ని యన్టీఆర్ ప్రదర్శించారు. ఇలా ఈ పాటతో మరోమారు సుద్దాల అందరి మన్ననలూ అందుకుంటున్నారు. భవిష్యత్ లోనూ తన పాటలతో సుద్దాల మరింతగా అలరిస్తారని ఆశిద్దాం.