Edida Nageswara Rao :కళా’పూర్ణోదయ’ నిలయా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఏడిద నాగేశ్వరరావు స్వస్థలం. 1934 ఏప్రిల్ 24న ఆయన జన్మించారు. చదువుకొనే రోజుల్లో తొలిసారి అమ్మాయి వేషం కట్టిన ఏడిద నాగేశ్వరరావు, తరువాత పలు నాటకాల్లో అనేక వేషాలు ధరించి ఆకట్టుకున్నారు. బి.ఏ. ఎకనమిక్స్ చదివే సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన వి.బి.రాజేంద్రప్రసాద్ తో స్నేహం కలిగింది. ఇద్దరినీ నాటకాలు మరింత చేరువ చేశాయి. చదువయ్యాక రాజేంద్రప్రసాద్ మద్రాసు చేరి, నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా ‘అన్నపూర్ణ’అనే చిత్రం నిర్మించారు. అందులో ఓ వేషం కోసం ఏడిద నాగేశ్వరరావును పిలిపించారు. అయితే అది కుదరలేదు. దాంతో నాగేశ్వరరావు కూడా మద్రాసుకే అలవాటు పడి, అక్కడే ఉంటూ నటునిగా వేషాల వేట ప్రారంభించారు.
యన్టీఆర్ ‘ఆత్మబలం’లో ఎస్వీ రంగారావు రెండో కొడుకుగా నటించారు ఏడిద. ఆ సినిమా గుర్తింపు సంపాదించి పెట్టింది. తరువాత ఏయన్నార్ ‘పవిత్రబంధం’లో డాక్టర్ వేషం వేశారు. “నేరము-శిక్ష, రణభేరి, మానవడు-దానవుడు, బంగారుబాబు, చిన్ననాటిస్నేహితులు” వంటి చిత్రాల్లో నటించారు. ‘నేరము-శిక్ష, చిన్ననాటి స్నేహితులు’ చిత్రాల సమయంలో ఆ సినిమాల దర్శకుడు కె.విశ్వనాథ్ తో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచీ ఇద్దరూ సినిమాలు, వాటిలో కళాత్మక విలువల గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఏడిద నాగేశ్వరరావు దాదాపు 30 చిత్రాలలో నటించారు. వందకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కాకినాడకు చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, వీర్రాజు అనే మిత్రులతో కలసి ‘వేంకటేశ్వర కళ్యాణం’ అనే అనువాద చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టింది. దాంతో మిత్రులు ఏదైనా స్ట్రెయిట్ మూవీని తెరకెక్కించాలని భావించారు. కె.విశ్వనాథ్ తో తనకున్న అనుబంధంతో ఏడిద ఆయనను కలిశారు. తత్ఫలితంగా ‘సిరిసిరిమువ్వ’ తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణవ్యవహారాలన్నీ ఏడిద నాగేశ్వరరావు చూసుకున్నారు. దాంతో ఆయనకూ మిత్రులు కొంత వాటా ఇచ్చారు. ‘సిరిసిరిమువ్వ’ మంచి విజయం సాధించి, మళ్ళీ లాభాలు చూశారు మిత్రులు. తరువాత ఆకాశం శ్రీరాములుతో కలసి పూర్ణోదయ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘తాయారమ్మ-బంగారయ్య’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా విజయాన్ని అందించింది.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
విశ్వనాథ్ తో ఉన్న అనుబంధంతో ఆయన వద్ద సంగీతసాహిత్యాలతో మిళితమైన ఓ మంచి కథ ఉందని తెలుసుకున్నారు ఏడిద నాగేశ్వరరావు. అయితే విశ్వనాథ్ సైతం అలాంటి చిత్రాలను జనం ఆదరిస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయినా, తీస్తే అలాంటి సినిమా తీయాలని భావించారు ఏడిద. తాడి రామకృష్ణ, తాడి హరిబాబు, తాడి బాబ్జీ వంటి మిత్రుల ఆసరాతో ఆకాశం శ్రీరాములు, ఏడిద సంయుక్తంగా ‘శంకరాభరణం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 1979లోనే పూర్తయింది. అయితే ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. పంపిణీదారులకు పలు ప్రదర్శనలు వేశారు. చివరకు లక్ష్మీఫిలిమ్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో, ఇతర ఏరియాల వారూ సరే అన్నారు. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ మొదటి వారం కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలు మాత్రమే ప్రదర్శితమయింది. మెల్లగా మౌఖిక ప్రచారం సాగింది.
‘శంకరాభరణం’ భలే బాగుందన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో ఉదయం ఆటలేవేసిన థియేటర్లు రెగ్యులర్ షోస్ ప్రదర్శించాల్సి వచ్చింది. 12 కేంద్రాలలో వంద రోజులు చూసిన ‘శంకరాభరణం’ తెలుగునేలపైనే కాదు, కన్నడ,తమిళ,మళయాళ సీమల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మంచి లాభాలు చూసింది. ఆ రోజుల్లో టాప్ స్టార్ యన్టీఆర్ సినిమాలు మాత్రమే ఘనవిజయం సాధిస్తే కోటి రూపాయలు వసూలు చేసేవి. అలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ తో రూపొంది, అంతగా పేరులేని వారు ప్రధాన పాత్రలు పోషించగా తెరకెక్కి అనూహ్యంగా అన్నిచోట్లా కలిపి కోటి రూపాయలు పోగేసింది. మిత్రులందరికీ మంచి లాభాలు రావడంతోపాటు ఎనలేని కీర్తి కూడా దక్కింది. ఎక్కడికి వెళ్ళినా నాగేశ్వరరావును ‘శంకరాభరణం’ నిర్మాత అని పిలిచేవారు. అందుకే ఆయన హైదరాబాద్ లో కట్టుకున్న ఇంటికి ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు.
తరువాత ఏడిద నాగేశ్వరరావు ఒక్కరే ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలలో కొన్నిటికి తాడి రామకృష్ణ, హరిబాబు, బాబ్జీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భారతీరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ నిర్మించారు. ఇళయరాజా బాణీల్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఆపై కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, జయప్రదతో ‘సాగరసంగమం’ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఇళయరాజా బాణీల్లోనే మరో మ్యూజికల్ హిట్ ను అందించింది. ‘శంకరాభరణం’తోనే తన అభిరుచిని చాటుకున్న ఏడిద నాగేశ్వరరావును జనం కూడా మెచ్చారు. పూర్ణోదయ సంస్థ నుండి ఓ సినిమా వస్తోందంటే అందులో తప్పకుండా సంగీతసాహిత్యాలకు పెద్ద పీట వేసి ఉంటారని ప్రేక్షకులు భావించేవారు. అందుకు తగ్గట్టుగానే ఏడిద నాగేశ్వరరావు చిత్రాలను నిర్మిస్తూ ముందుకు సాగారు. ఆయన తెరకెక్కించిన “స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు” చిత్రాలన్నీ సంగీత పరంగా అలరించాయి. తమ ‘తాయారమ్మ-బంగారయ్య’లో ఓ బిట్ రోల్ పోషించిన చిరంజీవి, తరువాత టాప్ స్టార్ అయ్యాక ఆయనతో “స్వయంకృషి, ఆపద్బాంధవుడు” వంటి చిత్రాలను నిర్మించారు.
నిజానికి చిరంజీవి కాల్ షీట్స్ ఇవ్వగానే ఓ భారీ కమర్షియల్ తీసేయవచ్చు. అయితే ‘శంకరాభరణం’ పేరు చెడిపోకుండా, తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మించారు నాగేశ్వరరావు. ‘స్వరకల్పన’ ద్వారా తన తనయుడు శ్రీరామ్ ను హీరోగా పరిచయంచేశారు. ఏడిద నాగేశ్వరరావు తీసిన చిత్రాలలో చివర కొన్ని అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. అయితే, ఆయన ఏ నాడూ రాజీపడి విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు. కడదాకా అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. 2015 అక్టోబర్ 4న ‘శంకరాభరణం’ నిర్మాత శంకరుని సన్నిధికి చేరుకున్నారు. భౌతికంగా ఏడిద నాగేశ్వరరావు లేకపోయినా, ఆయన సినిమాల ద్వారా జనం మదిలో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!