Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకుముందే తాము చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించడానికి ప్లాన్ చేశామని, కానీ, కొందరు చిరంజీవి పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారని చిత్రపురి కాలనీ ఫౌండర్, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజా రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి.. సినిమాల్లో నటిస్తున్నప్పుడే.. కార్మికులకు మంచి ఇళ్లు ఉండాలనే సంకల్పంతో తనవంతు సాయంగా చిత్రపురి కాలనీ స్థలాన్ని వారికి రాసిచ్చారు. ఆ తరువాత ఆయన పేరుమీదనే అక్కడ కార్యక్రమాలను నిర్వహించేవారు. ఇక ఇటీవల జరిగిన ఎంఐజీ హెచ్ ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహాత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ కార్యక్రమానికి ఫౌండర్ అయిన ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానం లేదట. ఈ విషయాన్నీ శైలజా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
” చిత్రపురి కాలనీ ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి మా నాన్నగారు.. ఆ కాలనీ కోసం నాన్న ఎంత కృషి చేశారో మాకు బాగా తెలుసు..ఎంఐజీ హెచ్ ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహోత్సవానికి మమ్మల్ని పిలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మగారు చాలా బాధ పడ్డారు. ఫౌండర్స్ మీరు లేకుండా గృహ ప్రవేశాలు ఏంటి అంటూ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే తట్టుకోలేక కమిటీ వారికి ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. ఇక చిరంజీవి గారి కన్నా ముందే మేము అక్కడ హాస్పిటల్ నిర్మించాలని అనుకున్నాం. అందుకు కమిటీ సభ్యులను కూడా కలిసి మాట్లాడం.. కానీ, వారు చిరంజీవి గారి పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేశారు. ఎందుకంటే.. చిరంజీవి గారి వెనుక ఉంటే వారికి కూడా పేరు వస్తోంది. అందుకే మమ్మల్ని పట్టించుకోలేదు” అంటూ ఆమె వాపోయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.