తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కథతో వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. దీనికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ టైటిల్ ను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. రదన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో తొలి కాపీ సిద్ధం చేసి విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పూర్ణోదయ సంస్థ రీఎంట్రీలోనూ విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు అనుదీప్, నాగ్ అశ్విన్.