Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో పవన్ పాల్గొంటారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్తో కలిసి పవన్ కళ్యాణ్ బాలయ్య టాక్ షోకు హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.
Read Also: Samantha: షాకింగ్.. సమంతకు అరుదైన వ్యాధి
మరోవైపు పవన్ కళ్యాణ్ తన మిత్రుడు అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షోకు కూడా హాజరవుతారని ఫిలింనగర్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. అలీ ప్రస్తుతం ఈటీవీలో అలీతో సరదాగా అనే టాక్ షోను నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ టాక్ షోకు హాజరయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వంలో అలీ కీలక పదవి పొందారు. ఆయనకు సోషల్ మీడియా సలహాదారుగా ఏపీ సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. అటు జగన్, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దత్తపుత్రుడు అంటూ పదే పదే పవన్ను సీఎం జగన్ విమర్శిస్తున్నారు. పవన్ కూడా జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ను అలీ ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్నది హాట్ టాపిక్గా మారింది. నిజంగానే అలీ షోకు పవన్ హాజరైతే మీడియాలో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మరి పవన్ అలీ షోలో పాల్గొంటారో లేదో అన్న విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.