RRR: ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీని భారత దేశం తరఫున ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ చేయకపోవడంపై విమర్శలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్. శంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇవాళ దర్శకుల సంఘం ప్రస్తుతం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ సైతం స్పందించారు. ఆయన తన ప్రకటనలో ”దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో, కల్పిత కధతో ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలు వెచ్చించి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్.’. కంటెంట్ పరంగా కానీ సందేశం పరంగా గానీ దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా” అని అని అన్నారు.
ఇక ఈ సినిమాలోని సన్నివేశాలను రక్తి కట్టించడంలో కానీ నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గానీ దర్శకులు రాజమౌళి ప్రాణం పెట్టి పని చేశారని, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ యా పాత్రలలో జీవించారని, అలానే టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘమ’ని కాశీ విశ్వనాథ్ తెలిపారు. అలాంటి సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయకుండా, ‘చెల్లో షో’ అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం, తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం శోచనీయని అన్నారు. ఈ చర్యను ఖండిస్తూ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా తన అసంతృప్తిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.