ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి పోయింది. ఇక ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది స్టార్స్ గా వెలిగారు. అందుకే ఇళయరాజాను ‘స్టార్ ఆఫ్ స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మేస్ట్రో, ఇసై జ్ఞాని’ అంటూ అభిమానులు కీర్తిస్తూనే ఉన్నారు. ఉన్నది సప్తస్వరాలే, వాటితో పలికే రాగాలెన్నో! ఉన్నది ఒక్కడే ఇళయరాజా, ఆయన పలికించిన మధురం ఎంతో! ఈ నానుడి తమిళనాటనే కాదు, తెలుగునేలపైనా విశేషంగా వినిపిస్తుంది.
ఇళయరాజా అసలు పేరు ఆర్. జ్ఞానదేశిగన్. 1943 జూన్ 2వ తేదీన ఆ నాటి సంయుక్త మద్రాసు రాష్ట్రంలోని తేని జిల్లా పన్నై పురంలో జన్మించారు. స్కూల్ లో చేర్పించేటప్పుడు రాజయ్యగా పేరు మార్చారు. ఆయన ఊరిజనం ‘రాసయ్య’ అంటూ పిలిచేవారు. తరువాత గురువు ధనరాజ్ మాస్టర్ ఆ పేరును ‘రాజా’గా మార్చారు. చిత్రసీమ చిత్రమైనది. ఇక్కడ ఎన్నో చిత్రవిచిత్రాలు సాగుతూ ఉంటాయి. ఆరంభంలో తనకు గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు, ఆ రోజు కడుపు నింపుకోవచ్చు అని ఆశిస్తూ ఎందరో సంగీత దర్శకుల గుమ్మాల చుట్టూ తిరిగారు రాజా. తెలుగువారైనా కన్నడ సీమలో తనదైన బాణీ పలికించిన జి.కె.వెంకటేశ్ వద్ద తమిళ తంబీ రాజాకు అవకాశం లభించింది. ఆయన వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రాజా. తొలి చిత్రం ‘అన్నకిలి’తో ఆయన పేరును ఇళయరాజాగా మార్చారు. ఆ తరువాత నుంచీ ఇళయరాజా ఏ నాడూ వెనుతిరిగి చూసుకోలేదు.
తెలుగు చిత్రసీమలో ఇళయరాజా బాణీలు పలుకక మునుపే, ఆయన తమిళంలో రూపొందించిన స్వరకల్పనను పలువురు ప్రముఖ సంగీత దర్శకులే అనుసరించారు. దీనిని బట్టే ఇళయరాజా గొప్పతనమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘భద్రకాళి’ మొదలు మొన్నటి ‘శ్రీరామరాజ్యం’ దాకా ఇళయరాజా తెలుగువారిని ఆకట్టుకొనే స్వరాలు పలికించారు. చిరంజీవి-కోదండరామిరెడ్డి-కెఎస్. రామారావు-యండమూరి కాంబోలో వచ్చిన నవలా చిత్రాలకు ఇళయరాజా బాణీలు ప్రాణం పోసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ అందించిన ఇళయరాజా, నాటి వర్ధమాన హీరోలందరికీ తన స్వరాలతో సక్సెస్ రూటు చూపించారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలచిన ఇళయరాజాకు రెండు సార్లు తెలుగు చిత్రాల ద్వారానే (సాగరసంగమం, రుద్రవీణ) నేషనల్ అవార్డు దక్కడం విశేషం. తమిళనాట పుట్టినా, తెలుగువారిని ఇళయరాజా స్వరకల్పన అలరించిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి. మన తెలుగు చిత్రాల ద్వారా విశేషఖ్యాతి ఆర్జించిన పరభాషా సంగీత దర్శకులలో ఇళయరాజా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ నాటికీ ఇళయరాజా బాణీలకు ఫిదా అయిపోయేవారెందరో ఉన్నారు. 80వ పడిలో అడుగు పెట్టిన ఇళయరాజా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.