(మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే)
ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తనదైన బాణీ పలికిస్తున్నారు చరణ్. నటనిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. తండ్రి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్, తరువాత తండ్రితోనే ‘సైరా…నరసింహారెడ్డి’ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు నాన్నతో కలసి నటిస్తూ ‘ఆచార్య’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక తన మిత్రుడు యన్టీఆర్ తో కలసి చెర్రీ నటించిన ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేస్తోంది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్ అభినయం అందరినీ అలరిస్తోంది.
రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. తండ్రి, మేనమామ, తాతయ్య అందరూ చిత్రసీమకు చెందినవారే కావడంతో చిన్నతనం నుంచీ చెర్రీ కూడా సినిమా వాతావరణాన్ని ఆస్వాధిస్తూనే పెరిగారు. దాంతో సహజంగానే చెర్రీకి చిత్రసీమపై ఆసక్తి కలిగింది. చిరంజీవి వారసుడిగా 2007లో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేశారు. చిరంజీవి తనయుడు కావడంతో చెర్రీకి ఒక్క సినిమాలో నటించకపోయినా, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. ఆయన నటవారసునిగా చరణ్ వస్తున్నాడని తెలియగానే, ఈ అంశంపైనా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’తోనే ఆకట్టుకోవడం విశేషం. చరణ్ తన రెండో చిత్రం ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్ పట్టేశారు. ‘మగధీర’ గ్రాండ్ సక్సెస్ చెర్రీని ఎక్కడికో తీసుకు వెళ్ళింది. అభిమానులకు మరచిపోలేని మధురానుభూతిని పంచింది ‘మగధీర’. అదే యేడాది చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. అభిమానులు చరణ్ లోనే చిరంజీవిని చూసుకోసాగారు.
తండ్రి అడుగుజాడల్లోనే పయనించసాగారు చెర్రీ. స్టార్ డమ్ రాగానే నాన్న బాటలోనే పయనిస్తూ హిందీ చిత్రసీమవైపూ దృష్టి సారించారు చరణ్. అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ మేన్ గా గుర్తింపు తెచ్చిన ‘జంజీర్’ ను రీమేక్ చేశారు చెర్రీ. హిందీలో ‘జంజీర్’గా, తెలుగులో ‘తుఫాన్’గా విడుదలయిన ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మళ్ళీ ‘మగధీర’ స్థాయి విజయం కోసం చరణ్ పలు విధాలా కృషి చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అయితే 2018లో అనూహ్యంగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఘనవిజయం సాధించింది. అందులో చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటన అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలచింది.
చిరంజీవి తన మాతృమూర్తి అంజనాదేవి పేరుపై అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. అదే తీరున రామ్ చరణ్ తన తల్లి సురేఖను సొంత చిత్రాలకు సమర్పకురాలిగా చేశారు. తమ ఇంటిపేరున కొణిదెల ప్రొడక్షన్స్ ను నెలకొల్పారు చెర్రీ. తొలి చిత్రంగా తండ్రితో ‘ఖైదీ నంబర్ 150’ నిర్మించారు. చిరంజీవి రీ ఎంట్రీగా విడుదలయిన ‘ఖైదీ నంబర్ 150’ ఘనవిజయం సాధించింది. తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన ‘సైరా… నరసింహారెడ్డి’ని కూడా చెర్రీనే నిర్మించడం విశేషం. నాన్నను వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం నిర్మాణ భాగస్వామిగా మారారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ ఏప్రిల్ 29న జనం ముందు నిలువనుంది. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’లో రామరాజుగా మెప్పించిన చరణ్, ‘ఆచార్య’లో సిద్ధా పాత్రలో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.