Mallesham: అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమా ‘మల్లేశం’ (2019) కు దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన మలయాళ చిత్రం ‘పాకా’ (2021) తో కూడా అసోషియేట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం హిందీలో ‘8 ఎ.ఎం. మెట్రో’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ ను ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు, కవి గుల్జార్ ఆవిష్కరించారు. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ నటించిన ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మే 19న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శిలాదిత్య బోరా ప్లాటూన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు.
పోస్టర్ లాంచ్ సందర్భంగా గుల్జార్ మాట్లాడుతూ, “స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా గొప్ప అనుభూతి కలిగింది. తక్షణమే చిత్రానికి సహకారం అందించాలనిపించింది. ఇందులో నేను రాసిన ఆరు కవితలు ఉన్నాయి’’ అని అన్నారు. దర్శకుడు రాజ్ మాట్లాడుతూ, “ఇది మెట్రోలో అనుకోకుండా కలుసుకుని, ఒకరినొకరు తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథ. గుల్జార్ సాబ్ అందించిన సహకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎప్పటికీ ఆయనకి రుణపడి వుంటాను’’ అన్నారు. “ఇందులో నా పాత్రకు ఒక సీక్రెట్ వుంది. అది ఇద్దరిని వేరు చేయడంతో పాటు నమ్మకాల్ని కూడా చీల్చుతుంది” అని ప్రధాన పాత్రధారి గుల్షన్ దేవయ్య చెప్పుకొచ్చారు. అలానే సయామి ఖేర్ మాట్లాడుతూ, “నేను గుల్జార్ సాహబ్ రాసిన కవిత్వాన్ని చదివానంటే మీరు నమ్మగలరా?’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ స్వరాలు అందించగా, కౌసర్ మునీర్ పాటలు రాశారు. వీటిని జుబిన్ నౌటియల్, జోనితా గాంధీ, జావేద్ అలీ, విశాల్ మిశ్రా, నూరన్ సిస్టర్స్ పాడారు.