చిత్రపురి కాలనీ అభివృద్ధికి అడ్డుపడవద్దని ప్రస్తుత అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేసి, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని శనివారం పాత్రికేయ సమావేశంలో ఆరోపించారు అనిల్. ఈ సమావేశంలో కోశాధికారి మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అళహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ ‘మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయింది. అప్పటి నుంచి కాలనీలో విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. సొసైటీపై ఇప్పటికే 21 కేసులు కోర్టులో ఉన్నాయి. ఎంతో మంది అధికారులు విచారణ జరిపి అవినీతి జరగలేదని తేల్చారు. ఇక ప్రస్తుతం చిత్రపురిలో ఎంఐజీ, డూప్లెక్స్, రో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎంఐజీలో ఐదు బ్లాకుల్లో రెండు బ్లాకులు పూర్తయ్యాయి. మరో మూడు తుది దశలో ఉన్నాయి.
నిర్మాతలకు సంబంధించిన మూవీ టవర్స్ లోని అవినీతి బయటకురాకూడదనే ఉద్దేశంతోనే తరుచూ చిత్రపురికాలనీలో వందల కోట్ల అవినీతి జరిగిదంటూ కొంత మందితో ప్రచారం చేయిస్తున్నారు. కేటాయించిన ఫ్లాట్స్ అమ్ముకుని మళ్లీ కావాలని బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు స్వార్థంతో వాళ్ల వెనక ఉండి ఈ గొడవలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే గత పాలక మండలి అడ్వాన్సులు చెల్లించిన కంపెనీల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం.
ప్రభుత్వ నిబంధనలకు లోబడే చిత్రపురి కాలనీలో చిత్రపురి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశాం. రెండు మాసాల్లో 430 మంది సినీ కార్మికులకు సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ లను కేటాయించబోతున్నాం. అలాగే కార్మికుల సంక్షేమం కోసం చిత్రపురి కాలనీలో చిరంజీవి గారు నిర్మించనున్న హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశాం. ఈ క్రమంలో అవినీతి మరక అంటించి సినీ కార్మికులు బయట తిరగలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆరోపణలు చేస్తే వ్యక్తులు సొసైటీకి నిధుల సేకరణ, సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతామంటే మా కమిటీ సత్వరమే రాజీనామా చేస్తాం’ అన్నారు.