Director Laxman K Krishna Interview About His Swathi Muthyam Movie: అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. అలానే మంచు విష్ణు ‘జిన్నా’ సైతం అదే రోజు వస్తుందని తెలుస్తోంది. చిత్రం ఏమంటే… అదే రోజున ప్రముఖ నిర్మాత, బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ హీరోగా పరిచయం అవుతున్న ‘స్వాతి ముత్యం’ సైతం విడుదల కాబోతోంది. దీనిని లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దసరా కానుకగా పెద్ద చిత్రాలతో పాటు తమ చిత్రమూ విడుదల కావడం ఆనందంగా ఉందంటున్నారు దర్శకుడు లక్ష్మణ్. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో తన సినీ ప్రయాణం గురించి ముచ్చటించారు.
తన నేపథ్యం గురించి లక్ష్మణ్ వివరిస్తూ, ”మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. స్కూల్ లో చిన్న చిన్న డ్రామాలు రాసేవాడిని. సినిమాల మీద ఇష్టంతో ఇంజనీరింగ్ ని మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడకు రాకముందే ముగ్గురు నలుగురం కలిసి ఒక టీమ్ లా షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. ఆ టీమ్ లో ఒక ఫ్రెండ్ కి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే, అతన్ని నమ్ముకొని మేమంతా ఇక్కడికి వచ్చేశాం. మూడు వేల రూపాయల లోపు బడ్జెట్ తో ‘లాస్ట్ విష్’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసి ఒకాయన లక్షా 30 వేలు బడ్జెట్ పెట్టడంతో ‘కృష్ణమూర్తి గారింట్లో’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి మంచి ఆదరణ లభించింది. సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు వచ్చింది. అప్పుడు నేను చెప్పిన ఒక స్టోరీ నచ్చి, సైమా వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తామన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అయితే ముందు ట్రయల్ గా 12 లక్షల బడ్జెట్ తో ‘సదా నీ ప్రేమలో’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాం. దానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇంతలో లాక్ డౌన్ రావడంతో ఆ సమయంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాయాలన్న ఉద్దేశంతో ‘స్వాతిముత్యం’ స్టోరీ రాయడం జరిగింది” అని చెప్పారు. ఈ సినిమా కథ గురించి చెబుతూ, ”గోదావరి జిల్లాల్లో చిన్న చిన్న టౌన్స్ లో ఉదయాన్నే స్కూల్ టీచర్స్ వెళ్లడం, ఇంటి దగ్గర ఉండే చుట్టాలు వచ్చి మన మీద సెటైర్స్ వేయడం.. ఇలా మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే ఈ కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు స్పందిస్తారు? పక్కింటి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి ? ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్ లో అప్పుడే జూనియర్ ఇంజనీర్ గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథ ఇది. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. ఇందులో హీరో పేరు బాల మురళీకృష్ణ” అని తెలిపారు.
‘స్వాతి ముత్యం’ అనే క్లాసిక్ టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టడం గురించి వివరిస్తూ, ”నిర్మాత చినబాబు గారికి స్టోరీ చెప్పకముందు వేరే వేరే టైటిల్ అనుకున్నాం. ఆయన మొత్తం కథ విన్నాక.. ఇందులో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఈ టైటిల్ సజెస్ట్ చేశారు. ఇందులో విలన్ ఎవరూ ఉండరు. ఒక టౌన్ లో కొన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. అందుకే ఆయన సజెషన్ తో ఈ టైటిల్ పెట్టాం. ఫస్ట్ ఈ టైటిల్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయమేసింది. కమల్ హాసన్ గారు పోషించిన పాత్రతో పోలుస్తారేమో అని భయపడ్డా. కానీ చినబాబు గారు ఇచ్చిన సపోర్ట్ తో ముందుకెళ్ళాం” అని అన్నారు. హీరో బెల్లంకొండ గణేశ్ గురించి చెబుతూ, ”మా ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. తనకి నేను చెప్పిన స్టోరీ నచ్చింది కానీ.. నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలనని అతనికి డౌట్స్ ఉండొచ్చు. అలాగే నాకు కూడా ఇతనితో అనుకున్న అవుట్ ఫుట్ ఇవ్వగలనా అనే డౌట్స్ వచ్చాయి. అయితే డైరెక్టర్ గా నేను, హీరోగా తను సక్సెస్ అవ్వాలని ఇద్దరం కలిసి ఎక్కువ ట్రావెల్ అయ్యి, చాలా వర్క్ షాప్స్ చేశాం. అలా ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో సెట్స్ మీద ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ విషయానికి వస్తే… ’96’ మూవీ చూసినప్పుడే ఆ అమ్మాయి నచ్చింది. మొదటి సినిమా చేస్తే ఈ అమ్మాయితో చేయాలనుకున్నాను. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే హీరోయిన్ పాత్రకు ఆమెని ఊహించుకునే రాసుకున్నాను. గణేష్ హీరోగా, సితార సంస్థ నిర్మాణం అనుకున్న తరువాత కొన్ని వేరే పేర్లు కూడా అనుకున్నాం. అయితే అదే టైంలో వర్ష నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ రావడం, ఆమె పేరు సజెస్ట్ చేయగానే ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోవడం జరిగిపోయాయి” అని చెప్పారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే ఆశాభావన్ని లక్ష్మణ్ వెలిబుచ్చాడు.