Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?

Multi Heroine

Multi Heroine

Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న కొత్త బిజినెస్ స్ట్రాటజీనా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో త్రిష ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్, మీనాక్షి చౌదరి, ఈషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేక గీతంలో మౌనీ రాయ్ సందడి చేయనున్నారు. చిత్రబృందం మాత్రం 14 లోకాల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతి మహిళా పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చెబుతోంది.

ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీలో దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రాజీషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’లో కూడా పలువురు హీరోయిన్లు నటిస్తున్న తెలుస్తోంది.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం సినిమా వ్యాపారం కేవలం థియేటర్లకే పరిమితం కాదు. ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని క్యాస్టింగ్ జరుగుతోంది. ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో భాషలో ఉన్న మార్కెట్‌ను ఉపయోగించుకోవడం ద్వారా సినిమా వ్యాపార అవకాశాలు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే మరోవైపు ప్రేక్షకుల్లో భిన్నమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. హీరోయిన్ల సంఖ్య పెంచడం కంటే, ప్రతి పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యం ఉండాలని వారు కోరుకుంటున్నారు. గతంలో భారీ తారాగణంతో వచ్చిన కొన్ని సినిమాలు కథ బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో తక్కువ పాత్రలతో, బలమైన కథతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మొత్తానికి పాన్ ఇండియా సినిమాల్లో మల్టీ హీరోయిన్ ఫార్ములా ఇప్పుడు స్పష్టమైన ట్రెండ్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో చివరికి నిర్ణయించేది మాత్రం కథే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేది స్టార్ హీరోయిన్ల సంఖ్య కాదు.. బలమైన కథ, పాత్రలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.