భారతీయ సంస్కృతి, జీవన విధానంలో విడదీయరాని భాగమైన పవిత్ర ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం.. భరతభూమి నుంచి ప్రపంచ యవనికపైకి తన మహా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. జూలై 24న గ్లోబల్ వైడ్గా విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్కు ముందు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. రామాయణంలోని విలువలతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సెంటిమెంట్ను గౌరవిస్తూ, దేశ హృదయమైన ఢిల్లీని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు. ఈ వేడుకలో ‘రామాయణ’ చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానుల కోలాహలం అంబరాన్నంటింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు తరాల అగ్ర నటీనటులు ఒకేచోట చేరడం ఈ ఈవెంట్కే హైలైట్గా నిలిచింది.
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇండియన్ సిల్వర్ స్క్రీన్పైనే ఒక సంచలనంగా మారింది. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ కనిపించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి తన హుందాతనం, కరుణతో కూడిన నటనతో ప్రాణం పోయనుంది. పాన్ ఇండియా స్టార్ యష్ ఈ చిత్రంలో మహాబలశాలి రావణుడిగా నటిస్తూ, తన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సన్నీ డియోల్.. భక్త హనుమాన్ పాత్రలో అలరించనున్నారు. ఒకప్పటి రామానంద్ సాగర్ రామాయణంలో రాముడిగా కోట్లాది మంది మనసులు గెలిచిన అరుణ్ గోవిల్, ఇందులో దశరథ మహారాజుగా నటిస్తుండటం విశేషం. కైకేయిగా శోభన, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తుండగా.. శూర్పణఖగా గ్లామరస్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ‘దంగల్’ వంటి విలక్షణ చిత్రంతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా చైనా మార్కెట్లో వందల కోట్ల వసూళ్ల రికార్డులు సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయణాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో తెరపై ఆవిష్కరించడమే తన బాధ్యతని, ఇందులో కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా వేల ఏళ్లుగా నిలిచిన మానవీయ భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభవిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

