MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు కూడా రెండు, మూడు నెలల్లో రీ రికార్డింగ్ పూర్తి చేసే కీరవాణి.. ‘వారణాసి’ కోసం ఏకంగా ఐదు నెలల సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైతే ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమాలకు కూడా తక్కువ సమయంలో బీజీఎం అందించే కీరవాణి.. ‘వారణాసి’ విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ తొలిసారి పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మ్యూజిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘వారణాసి’ థీమ్ మ్యూజిక్తో కీరవాణి తన మార్క్ చూపించగా.. పూర్తి స్థాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరింత కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, సెప్టెంబర్ నుంచి మ్యూజిక్ పనులు ప్రారంభించి జనవరి వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కీరవాణి గతంలో వెల్లడించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

