ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ ”శేఖర్ కమ్ముల, దేవా కట్టా, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న కొందరు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ సహకారంతో ‘క్షీరసాగర మథనం’ రూపొందించాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి” అన్నారు. చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి అజయ్ అరసాడ సంగీతం అందించారు.