Allu Arjun: ఈ రోజు హైదరాబాద్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్.. AAFA (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) తరఫున 900 మంది అభిమానులకు ఇన్సూరెన్స్ పాలసీలను అందించినట్లు సమాచారం.
అంతేకాకుండా ప్రతి అభిమానితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగిన బన్నీ, దాదాపు ఆరు గంటల పాటు వేదికపైనే ఉండి అభిమానులతో గడిపారు. అభిమానులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ వారిని ఉత్సాహపరిచారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చూపించిన ఈ అభిమానం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదికపై నుంచి బన్నీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషికి ఒక రోజు 100 శాతం ఎనర్జీ, సమయం ఉంటుందని, దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. “ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీకు ఉన్న సమయం, శక్తి, అవకాశాలను మీకు నచ్చిన పనికే వినియోగించండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి” అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు.
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤 pic.twitter.com/HV9mHSA9aW— Allu Arjun (@alluarjun) July 28, 2026

