Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా డీఎంకే నేత, ఎంపీ సీవీ షణ్ముగన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి వ్యసనం కారణంగా హత్యలు, దోపిడీలు, ఇతర నేరాలు పెరుగుతున్నాయని కూడా ఆరోపించారు.
అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన “మీ కలలు చెప్పండి, మేము నెరవేర్చుతాం” అనే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మీ కలలు చెప్పండి, నేను నెరవేర్చుతాను అని సీఎం అంటున్నారు. అయితే నాకు నయనతార కావాలి… నా కలను నెరవేరుస్తారా?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్నవారిలో చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా మాట్లాడారని పలువురు మండిపడ్డారు.
వివాదం పెరగడంతో అనంతరం షణ్ముగం వివరణ ఇచ్చారు. ప్రసంగ సమయంలో పొరపాటున ఒక నటి పేరు ప్రస్తావించానని, ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదని చెప్పారు. జరిగిన ఘటనకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. మొత్తంగా ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది.. మొన్నటి మొన్న ఓ బీజేపీ నేత.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ఇప్పుడు.. అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..
మరోవైపు, నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించింది నడిగర సంఘం.. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలను మేం ఒప్పుకోం అని స్పష్టం చేసింది.. బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అని హితవు చెప్పింది.. బేషరతుగా నయనతారకు క్షమాపణ చెప్పాలని అని నడిగరసంఘం డిమాండ్ చేసింది..