The Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ కూడా మండిపడుతున్నాడు. కేరళలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి సినిమాలు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్కు బెస్ట్ రెసిపీ..
ఇదిలా ఉంటే, ది కేరళ స్టోరీ 2 విమర్శకుల జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా చేరారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ కోసం కొచ్చికి వచ్చిన అనురాగ్ను “ది కేరళ స్టోరీ 2” గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సినిమా ద్వారా సమాజాన్ని విభజించాలని చూస్తున్నారని, డబ్బు సంపాదించడానికి తీసిన ఒక ప్రాపగండా అని అభివర్ణించారు. ఈ సినిమా ట్రైలర్లో ఒక ముస్లిం కుటుంబం, హిందూ యువతికి బలవంతంగా బీఫ్(గొడ్డు మాంసం) తినిపిస్తున్నట్లు చూపించారు. దీనిపై అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నిజ జీవితంలో ఎవరూ కూడా అలా చేయరని, బీఫ్ కాదు కనీసం ఎవరూ బలవంతంగా కిచిడీ కూడా తినిపించరని అన్నారు.
సినిమా నిర్మించిన వారు కేవలం లాభాల కోసమే చూస్తున్నారని, సమాజంలో ద్వేషాన్ని పెంచి పోషించి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఈ చిత్రం ప్రజలను విడదీసేలా ఉందని, వాస్తవాలకు దూరంగా ఉందని చెప్పారు. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన “ది కేరళ స్టోరీ 2” ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.
