మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు సమస్య వల్ల బాధపడే వారు ఒక్కసారి మన ఇంట్లో ఉండే వంటగది వైపు ఒక లుక్ వేయండి. అదేంటి అని అనుకుంటున్నారా? అవునండీ.. వంట గదిలో లభించే సహజ పదార్థాలతోనే ఈ సమస్యను నయం చేసుకోవచ్చు.
చిట్కాలు
* మిరియాలను దంచి మరిగించిన పాలల్లో వేసి తాగడం వల్ల గొంతునొప్పి సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. జలుబు కూడా తగ్గుతుంది.
* లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడి వేడిగా తాగాలి.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. దీంతో చిక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది.