Iran War: ఇరాన్ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి.
1) మొదటిది ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం. ఈ ద్వీపం ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతులకు కేంద్రంగా ఉంది. ఒకవేళ అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే, అది ఇరాన్కు తీరని దెబ్బగా మారుతుంది. ఖార్గ్ ద్వీపాన్ని ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పరిగణిస్తారు. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ ద్వీపం, చాలా ఏళ్లుగా ఆ దేశానికి ప్రధాన చమురు కేంద్రంగా ఉంది. ఇది దేశం మొత్తం క్రూడ్ ఆయిల్ రవాణాలో 80-90 శాతాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ పెద్ద ట్యాంకులు, లోడింగ్ జెట్టీలు, పైప్ లైన్ నెట్వర్క్ ఉంది. ఖార్గ్ ద్వీపంపై ఏ దాడి అయినా ఇరాన్ ఆదాయంపై ప్రభావం చూపించడంతో పాటు ప్రపంచ చమురు మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతుంది.
2) రెండో ఆఫ్షన్ హార్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం. ఈ ద్వీపం ఇరాన్ స్థావరాలు, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల్ని పర్యవేక్షించే రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. నౌకలపై దాడి చేసే చిన్న పడవలు ఇక్కడే ఉన్నాయి. ఇరాన్, ఖాసెమ్ మరియు లారక్ ద్వీపాల మధ్య ఒక టోల్ బూత్ను ఏర్పాటు చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి భద్రతా రుసుముల రూపంలో లక్షలాది రూపాయలను వసూలు చేయడానికి ఇరాన్ ఇక్కడి నుండే సన్నాహాలు చేస్తోంది.
3) మూడో ఎంపిక తూర్పు పర్షియన్ గల్ఫ్లోని అబు ముసా ద్వీపంపై దాడి చేయడం. ఈ ద్వీపం ద్వారా గల్ఫ్ నుంచి బయలుదేరే నౌక మార్గాలపై ఇరాన్కు నియంత్రణ ఉంటుంది. ఈ ద్వీపం సమీపంలోని గ్రేటర్, లెసర్ తున్బ్ ద్వీపాలు ఇరాన్ నియంత్రణలో ఉన్నాయి, కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వాటిపై హక్కును కోరుతోంది. యూఏఈ అమెరికాకు ఒక కీలక మిత్రదేశం.
4) నాలుగో ఆప్షన్ ఇరాన్ చమురు ఎగుమతులు చేసే ఓడల్ని నేరుగా అమెరికా అడ్డగించవచ్చ, స్వాధీనం చేసుకోవచ్చు.
గ్రౌండ్ ఆపరేషన్లపై చర్చ:
ఆక్సియోస్ ప్రకారం, ఇరాన్ నుంచి ఎన్రిచ్ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా దళాలు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇరాన్ అణు కర్మాగారాలలో నిల్వ ఉన్న అణు యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి, ఆ దేశం లోపలికి చొచ్చుకెళ్లి భూతల ఆపరేషన్ నిర్వహించేందుకు అమెరికా సైన్యం కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ యురేనియం శిథిలమైన అణుస్థావరాల కింద పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఇరాన్ ఈ అణు పదార్థాన్ని పొందకుండా ఉండేందుకు అమెరికా వైమానిక దాడులు చేయవచ్చు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) యొక్క ఇటీవలి నివేదికల ప్రకారం, ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ స్థాయిని గణనీయంగా పెంచింది. 2025–26 అంచనాల ప్రకారం, ఇరాన్ ఇప్పటికే సుమారు 60% ఎన్రిచ్డ్ యురేనియంను ఉత్పత్తి చేసింది, ఇది ఆయుధ-స్థాయి 90%కి కొద్దిగా తక్కువగా పరిగణించబడుతుంది. 2025 మధ్య నాటికి, దాని వద్ద సుమారు 440 కిలోగ్రాముల 60% సుసంపన్నమైన యురేనియం ఉంటుందని అంచనా. అయితే, ఈ ప్రణాళికలపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ చర్చలకు ముందుకు రాకుంటే, ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.