Pakistan: ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యవాసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి, సైన్యాన్ని బలోపేతం చేస్తోంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచుతోంది. జూలై 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ఆవిష్కరించనుంది.
Read Also: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతోంది. సోమవారం బడ్జెట్పై చర్చించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అతడి ఆర్థిక బృందంతో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సమావేశమయ్యారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలకంగా ఉంది. సుమారుగా రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్ ని పాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంట్లో 18 శాతం రక్షణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించింది.
ప్రస్తుత భద్రతా ముప్పుల దృష్ట్యా, రక్షణ బడ్జెట్ను 18 శాతం పెంచి రూ.2.5 ట్రిలియన్లకు పెంచాలనే ప్రతిపాదనకు పిపిపి మద్దతు ఇచ్చిందని పాక్ ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో, ప్రభుత్వం రక్షణ వ్యయం కోసం రూ.2,122 బిలియన్లను కేటాయించింది, ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఉంచిన రూ.1,804 బిలియన్ల కంటే 14.98 శాతం ఎక్కువ. రుణ చెల్లింపుల తర్వాత వార్షిక వ్యయంలో రక్షణ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం, రుణాల చెల్లింపుకు రూ. 9700 బిలియన్లు కేటాయించారు.