Tarique Rahman: బంగ్లాదేశ్లో 18 నెలల పాటు కొనసాగిన అనిశ్చితి తొలిగిపోయింది. ఎట్టకేలకు ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం కొలువుదీరనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జమాతే ఇస్లామీతో పోలిస్తే పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. బంగ్లా దశాదిశను మార్చే ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ ప్రధాని కాబోతున్నారు. 60 ఏళ్ల తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల పాటు యూకేలో ప్రవాసంలో జీవించి, సొంత దేశానికి వచ్చిన నెలల్లోనే అత్యున్నత పదవిని అధిష్టించనున్నారు. ఆయన పోటీ చేసిన ఢాకా-17, బొగురా-6 స్థానాల నుంచి గెలిచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. బీఎన్పీ ఈ ఎన్నికల్లో 300 స్థానాలకు గానూ 292 స్థానాల్లో పోటీ చేసింది. దాదాపుగా 209 స్థానాల్లో విజయం సాధించింది.
Read Also: AUS vs ZIM: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
తారిఖ్ రెహ్మాన్ ఎవరు..?
తారిఖ్ రెహ్మాన్ ఆర్మీ అధికారి జియాఉర్ రెహ్మాన్, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియా పెద్ద కుమారుడు. 2001-2006 మధ్య బీఎన్పీ-జమాత్ సంకీర్ణ ప్రభుత్వంలో ‘‘డార్క్ ప్రిన్స్’’గా పిలిచేవారు. ఆయన బంగ్లాదేశ్లో ‘‘షాడో పీఎం’’గా పనిచేశారు. 2007లో కేర్ టేకర్ ప్రభుత్వంలో అరెస్టై 17 నెలలు జైల్లో గడిపాడు. పలు కేసులు ఇతడిపై ఉన్నాయి. మనీలాండరింగ్, హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో దోషిగా నిర్ధారించబడ్డారు. కస్టడీలో హింసిస్తున్నారని, వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి 17 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఈ ఏడాది ఖలీదా జియా మరణించిన తర్వాత ఈయన బీఎన్పీ చీఫ్గా ఎన్నికయ్యారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, 2024 ఆగస్టులో భారత్ వచ్చారు. ఈ పరిణామం తర్వాత తారిఖ్ రెహ్మాన్ శకం మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధాని కాబోతున్నారు.