Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.
ఈ వ్యవహారం మొత్తం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు మునీర్ డబుల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో షరీఫ్, మునీర్లు ఇద్దరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో అంటకాగుతున్నారు. ట్రంప్ వీరిద్దరిపై పదే పదే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, యూఎస్-ఇజ్రాయిల్లు కలిసి ఖమేనీని చంపేశారని పాక్ ప్రజలు నమ్ముతున్నారు. దీంతో అమెరికాతో దగ్గరగా ఉన్న మునీర్పై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..
మరోవైపు అమెరికాను కాదని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో పాక్ ఉంది. ట్రంప్కు ఎదురు తిరిగితే ఏమవుతుందో షరీఫ్, మునీర్లకు తెలుసు. మరోవైపు, స్వదేశంలో విమర్శలు. ఇలా రెండు వైపులా ఒత్తిడి ఎదురవుతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఇంట్రెస్టుల్ని రక్షించాల్సిందే. పాక్ ప్రతిపక్షాలు, ఇతర మత సంస్థలు మాత్రం మునీర్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పాక్ పరిస్థితి చూస్తే కర్ర విరగకుండా, పాము చావకుండా చేస్తుంది. ఓ వైపు నిరసనకారుల్ని శాంతింప చేసేందుకు శాంతియుత నిరసనలకు అనుమతి ఇస్తోంది. మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా రోడ్లపైకి వచ్చారు. నిరసనకారుల్ని శాంతిపచేయడానికి ఉలేమాలతో సమావేశం నిర్వహించారు. అల్లర్లను పరిష్కరించాలని కోరారు.
