పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రావల్పిండిలోని జైలు దగ్గర నిరసనలు చేపట్టారు. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు చూపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hong Kong: హాంగ్ కాంగ్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారన్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. మంచి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్కు ఫైవ్స్టార్ హోటల్లో కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US: వైట్హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్కు సీరియస్!
ఇక ఇమ్రాన్ ఖాన్ను చూపించాలని సోదరీమణులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 2న కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ను మరొక జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను అధికారులు ఖండించారు. ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అక్కాచెల్లెళ్లు ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తాయి. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు సీఎంను కూడా అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే హత్యకు గురయ్యారంటూ పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని పాక్ ప్రభుత్వం స్పష్టంచేసింది.