పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇక తాజాగా సరికొత్త కుట్రలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ అగ్ర పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!
అసిమ్ మునీర్.. ఆ మధ్య విదేశాల్లో స్థిరపడిన పాక్ జాతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. కాశ్మీర్ మన గుండెకాయలాంటిది.. మన ఊపిరి అంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో చంపేశారు.
ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
తాజాగా అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత వారం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్-అసిమ్ మునీర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాతే పాకిస్థాన్లో రాజకీయ మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలా సమావేశాలు జరగడం ఇది రెండోసారి. వరుస భేటీలతో పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని అసిమ్ మునీర్తో భర్తీ చేయాలని భారీగా పుకార్లు జరుగుతున్నాయి. దౌత్యపరంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం తిరుగుబాటు కూడా జరగొచ్చని వదంతులు నడుస్తున్నాయి.
ఈ మధ్య అసిమ్ మునీర్ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ గల్ఫ్, ఆసియా దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆసిమ్ మునీర్ కూడా వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడు కావడం ఖాయమంటూ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ ప్రధాని లేకుండానే శ్రీలంక, ఇండోనేషియా పర్యటనలకు కూడా మునీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనల నేపథ్యంలో పాకిస్థాన్లో ఏదో జరగబోతుందని ప్రచారం సాగుతోంది.
ఇక గత నెలలో అసిమ్ మునీర్ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో మునీర్కు ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కాకుండా మునీర్కు ప్రత్యేక ఆహ్వానం పంపడంపై అప్పుడే పెద్ద చర్చ జరిగింది. పాకిస్థాన్లో ఏదో జరగబోతుందని చర్చలు నడిచాయి. దౌత్యపరమైన ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్లో తిరుగుబాటు తప్పదని భావిస్తున్నారు. 1958, అక్టోబర్లో సైనిక తిరుగుబాటు కారణంగా అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జాను పదవీచ్చుతుని చేసి.. ఆయుబ్ ఖాన్ దేశాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు అసిమ్ మునీర్ కూడా అదే మాదిరిగా చేయాలని చూస్తు్న్నారు. అదే గనుక జరిగితే పాక్ చరిత్రలో ఇది రెండో సంఘటనగా మిగులుతుంది.
ఇక జైల్లో తనకేమైనా జరిగితే మునీర్దే బాధ్యత అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అడియాలో జైల్లో ఉన్నారు. అంటే మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడైతే తనకేదైనా జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. అసలేం ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.