దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలోని సెలయేర్లు, పర్వతాల అందాల చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.
ఈ క్రమంలో వచ్చిన టూరిస్టులు తిరిగి వెళ్తున్న సమయంలో స్వాత్ లోయలోని గాబిన్ జబ్బా సమీపంలోని లాల్కోలోయలో జారి లోయలో పడింది. చనిపోయినవారంతా స్వాత్ లోయలోని మట్టా తాహసీల్ వాసులుగా అధికారులు గుర్తించారు. మరణించిన వారి కుటుంబాలకు ఖైబర్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ కాన్ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.
Read Also: Hyderabad: యువతి ఆశ చూపించి.. కోటిన్నర కాజేశారు
గతంలో కూడా పాక్ వాయువ్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన ఈ ప్రావిన్స్ లో రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలై నెల మొదట్లో నైరుతి పాకిస్తాన్ లో ప్రయాణికులు బస్సు వర్షాల కారణంగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.