మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్కు పలుమార్లు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా ప్రతి సవాల్ విసిరారు. అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమెరికా యుద్ధ నౌకలను నాశనం చేయగల ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా దాడులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. దీంతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.
ఖమేనీ తన సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని అతిపెద్ద విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ నీటి అడుగున మునిగిపోయిన ఫొటోను, సమాధిని వర్ణించే చిహ్నాన్ని పోస్ట్ చేశారు. ‘‘యుద్ధనౌకల కంటే ఆయుధాలు చాలా ప్రమాదకరమైనవి.’’ అని పేర్కొన్నారు. ‘‘ఇరాన్కు యుద్ధనౌకను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు నిరంతరం చెబుతుంటారు. యుద్ధనౌక ప్రమాదకరమైన సైనిక హార్డ్వేర్. కానీ ఆ యుద్ధనౌక కంటే ప్రమాదకరమైనది.. దానిని ముంచగల ఆయుధం ఉంది.’’ అని ఖమేనీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా సై అంటే సై అనడానికి సంకేతాలు ఇచ్చింది.
జెనీవా వేదికగా దాదాపు అమెరికా-ఇరాన్ మధ్య 3 గంటల పాటు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన డిమాండ్లను అంగీకరించడానికి టెహ్రాన్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అలా చర్చలు జరుగుతున్న సమయంలోనే టెహ్రాన్ హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక విన్యాసాలను ప్రారంభించింది.
చర్చల తర్వాత ట్రంప్ ప్రత్యేక రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతినిధులు రెండు వారాల్లోపు కొత్త ప్రతిపాదనలతో తిరిగి రావచ్చన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించే లక్ష్యంతో ఇవి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. ఈ చర్చలు నిర్మాణాత్మకమైనవి.. సానుకూలమైనవిగా అభివర్ణించారు. మునుపటి సమావేశం కంటే మెరుగైన పురోగతి సాధించామని చెప్పారు. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైది మాట్లాడుతూ.. చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయన్నారు.
ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అతి పెద్ద నౌకతో పాటు మరిన్ని శక్తివంతమైన నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక శత్రువుల అంతు చూస్తోంది. ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ యుద్ధనౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో ప్రాణాంతక యుద్ధ విమానాలు ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బకొట్టగల సామర్థ్యం ఉంటుంది. అయితే అమెరికా యుద్ధ నౌకలను ముంచగల సామర్థ్యం తమ కూడా ఉందని ఇరాన్ అంటోంది. ఏమవుతుందో చూడాలి.
The Americans constantly say that they’ve sent a warship toward Iran. Of course, a warship is a dangerous piece of military hardware. However, more dangerous than that warship is the weapon that can send that warship to the bottom of the sea.
— Khamenei.ir (@khamenei_ir) February 17, 2026
The US President keeps saying that they have the strongest military force in the world. The strongest military force in the world may at times be struck so hard that it cannot get up again.
— Khamenei.ir (@khamenei_ir) February 17, 2026