Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత యూఎస్ నౌకకు ఎంవీ సాయిబాబ నుంచి డిస్ట్రెస్ కాల్ వెళ్లినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది.
ఎర్ర సముద్రంలో భారత్ వస్తున్న నౌకతో పాటు మరో నౌక తాము దాడికి గురవుతున్నట్లు యూఎస్ నౌకదళ షిప్కి సమాచారం అందించాయి. భారత్ వస్తున్న నౌకతో పాటు ఎంవీ బ్లామనెన్ అనే నార్వే జెండా కలిగిన కెమికల్ ట్యాంకర్ నౌకపై కూడా హౌతీ డ్రోన్ దాడి జరిపింది. అయితే ఈ దాడి మిస్ అయినట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది.
Read Also: CM Revanth Reddy: ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే అధికారులు జోడెద్దుల్లా పని చేయాలి
అంతకుముందు రోజు ఇండియా వైపు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్ దీనిపై దాడి చేసిందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. దాదాపు 20 మంది భారతీయ సిబ్బందితో కూడిన MV కెమ్ ప్లూటో, ముడి చమురుతో ఇండియాకు వస్తున్న క్రమంలో గుజరాత్ లోని వెరావల్కి నైరుతి దిశలో 200 నాటికన్ మైళ్ల దూరంలో దాడికి గురైంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యలో యెమెన్ లోని హౌతీ తిరుగుబాటు దాడులు రెడ్ సీ నుంచి వచ్చి వెళ్లే ట్యాంకర్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న, ఇజ్రాయిల్ కి చెందిన నౌకలపై దాడులు చేస్తున్నారు.