Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. హమాస్ని పూర్తిగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని తేల్చి చెప్పింది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దాడులను చేస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో గాజాలో కూడా 1500కి పైగా మంది మరణించారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3000 వేలకు చేరింది.
Read Also: Bhupesh Baghel: సమావేశంలో క్యాండీక్రష్ ఆడిన కాంగ్రెస్ సీఎం.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ కేంద్ర కూడా పనిచేయడం లేదని నివేదికలు తెలిపాయి. దీంతో గాజాలో అంధకారం అలుముకుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనం ఇలా ప్రతీ అవసరాన్ని ఇజ్రాయిల్ సైన్యం కట్ చేసింది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ, “విద్యుత్ ఉండదు, ఆహారం లేదు, ఇంధనం ఉండదు, ప్రతిదీ కట్ చేస్తామని” హెచ్చరించారు. అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజాలోని పలు ప్రాంతాలకు పూర్తిగా విద్యుత్ని నిలిపేసింది. తాజాగా పాలస్తీనా ఎన్క్లేవ్ లోని ఏకైక పవర్ స్టేషన్ పనిచేయడం ఆగిపోయింది.
ఇప్పటికే గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీని ఇజ్రాయిల్ వైమానికదళం ధ్వంసం చేసింది. హమాస్ ఉగ్రవాదులు ఉంటున్న ప్రతీ ఇంటిని పేల్చేస్తోంది. హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫీ ఇంటిని కూడా టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫే కుటుంబానికి చెందిన పలువురు మరణించినట్లు హమాస్ ధృవీకరించింది. మరోవైపు హమాస్ కి మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు, సిరియా నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇజ్రాయిల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది.