Earthquake: వరస భూకంపాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఈశాన్య తైవాన్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలకు రాజధాని తైపీలోని భవనాలు వణికాయి. అయితే, పెద్దగా నష్టం వాటిల్లలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఆ దేశ కాలమానం ప్రకారం, గురువారం సాయంత్ర 5 గంటలకు 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ మరో ప్రకటనలో పేర్కొంది.
Read Also: Rahul gandhi: ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి అవమానం!.. స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చివరిలో సీటు
యూఎస్జీఎస్ ప్రకారం.. ఇది యిలాన్ కౌంటీకి ఆగ్నేయంగా 44 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది. తైవాన్ ప్రభుత్వం ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. తైవాన్ ప్రాంతం రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరిసారిగా ఏప్రిల్ నెలలో భూకంపం సంభవించింది. ఈ సమయంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది 25 ఏళ్లలో అత్యంత శక్తివంతమైందిగా అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ భూకంపంలో కనీసం 17 మంది మరణించారు. ఇది తూర్పు నగరమైన హువాలియన్ భూకంప కేంద్రం చుట్టూ కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లింది.