చలి కాచుకునేందుకు ఓ దొంగ ఏకంగా బైక్నే తగలబెట్టాడు. ఈఘటన నాగపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. నాగపూర్లోని యశోదరా నగర్లో ఇటీవలి కాలంలో పలు బైక్ లు చోరికి గురయ్యాయి. దాంతో పలువురు వాహనాదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో ఓ ముఠాను అరెస్టు చేశారు. చోటా సర్ఫరాజ్తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్లను దొంగిలించినట్టు తేలింది. వాటిల్లో.. 9 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. అయితే 10వ బైక్ గురించి చోటా సర్ఫరాజ్ను ప్రశ్నించగా పోలీసులకు అతడు చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. చలి ఎక్కువగా ఉందని.. అందుకే చలి కాచుకునేందుకు ఆ బైకుకు నిప్పు పెట్టి చలి కాచుకున్నాని తెలిపాడు. పోలీసులు ఈ ముఠా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.