సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఇద్దరు దంపతుల హత్య కలకలం రేపింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాచ్మన్ దంపతులను అత్యంత దారుణంగా హత్యచేశారు. దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఇద్దరి ప్రాణాల్ని కబలించటం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో భార్యాభర్తలను హత్య చేయడం సంచలనం సృష్టించింది. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో పలు ఆధారాలు సేకరించారు. మృతులిద్దరిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల, ధరావత్ మంగమ్మగా గుర్తించారు.
Also Read:Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ఇంద్రేశం.. ధరావత్ సోముల గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అనే బిల్డర్ దగ్గర వాచ్మెన్గా పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లయింది. చిన్న కూతురు సానియా పదవ తరగతి చదువుతోంది. ఇటీవలే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ఇంద్రేశం.. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు దొంగతనాలకు అడ్డాగా మారుతున్న ఇంద్రేశంలో వాచ్మెన్ దంపతుల హత్య సంచలనంగా మారింది.
వాచ్మెన్ దంపతులను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో అసలు హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వాచ్మెన్ దంపతులకు ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? భూమి తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదా చోరీకి వచ్చిన వారు ఎక్కడ దంపతులు తమను గుర్తుపడతారో అని హత్య చేశారా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.