Hyderabad Horror: ప్రియురాలిని పగబట్టాడు.. పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో కన్నూ మిన్నూ కానకుండా.. ఎవరూ చేయని పని చేశాడు. చివరికి యువతి, ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? ఏం చేశాడు? యవత సినిమాలు చూసి చెడిపోతున్నారా? లేక బాగుపడుతున్నారా..? ఈ చర్చను కాసేపు పక్కకు పెడితే.. యువతపై సినిమాల ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. ఈ క్రమంలో సినిమాల నుంచి మంచి కంటే ఎక్కువగా చెడునే తీసుకుంటున్నారు. ఫలితంగా సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది. ఇటీవల విడుదలై విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఆదర్శంగా తీసుకున్న ఓ యువకుడు.. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడ్డాడు.
READ ALSO: KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్
రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు.. యువకుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారు. సరిగ్గా అదే తరహాలో ఏకంగా తన ప్రియురాలిపైనే పగబట్టాడు ప్రియుడు. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి ఎదులాబాద్లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆమెకు కుటుంబ సభ్యుల పరిచయంతో మనోహర్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కూడా సమీప బంధువులవుతారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైద్య పరీక్షల్లో మనోహర్కు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పెళ్లికి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని మనోహర్ అంగీకరించలేకపోయాడు.
మార్చి 11న అన్నోజిగూడ ప్రాంతంలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు మనోహర్. తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కానీ అంతకు ముందే కంత్రీ ప్లాన్ వేసుకుని వచ్చాడు. ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం.. యువతికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న రక్తం ఎక్కించి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం యువతికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయారు. ఐతే పదేపదే జ్వరం ఎందుకు వస్తుందని యవతిని డాక్టర్లు అడిగారు. దీంతో డాక్టర్ల ఒత్తిడితో మనోహర్ సిరంజి ద్వారా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు తెలిపింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు యువతి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. గతంలోని మనోహర్ తండ్రి హెచ్ఐవి సోకి మరణించాడు. తల్లికి కూడా హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న నేపథ్యంలో తనతో పెళ్లికి నిరాకరించిందని భావించిన మనోహర్.. ఆమెకు కూడా హెచ్ఐవీ ఉంటే తనను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ సంఘటన సమాజంలో హెచ్ఐవి వంటి వ్యాధులపై అవగాహన ఎంత అవసరమో మాత్రమే కాకుండా, సంబంధాలలో నిజాయితీ లేకపోతే అది ఎంత పెద్ద విషాదానికి దారి తీస్తుందో చూపించింది. ప్రేమ, పెళ్లి వంటి బంధాలు పరస్పర గౌరవం, బాధ్యతలపై నిలబడాలి గానీ ప్రతీకారం, కోపంతో తీసుకునే నిర్ణయాలు అమాయకుల జీవితాలను నాశనం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Rishabh Pant: తగ్గేదే లే అంటున్న రిషబ్ పంత్! ఐపీఎల్ వేళ సంచలన మార్పులు..