Rishabh Pant: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారారు. “ఎన్ని కిలోలు తగ్గారు?” అనే ప్రశ్నకు పంత్ సమాధానం చెప్పకపోయినా, ఆయన కనిపిస్తున్న తీరు చూస్తేనే అర్థమవుతోంది గత ఐదు నెలలుగా ఆయన ఎంత కష్టపడ్డారో. ఫిట్నెస్లో మాత్రమే కాదు, ఆట తీరులోనూ పంత్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. చెన్నైలో లక్నో శిబిరానికి చేరుకోవడానికి ముందు పంత్ ఐదు రోజుల పాటు ముంబైలో దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ దగ్గర ప్రత్యేక శిక్షణ పొందాడు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన యువీ.. పంత్కు షాట్ సెలక్షన్, బ్యాట్ స్వింగ్, మానసిక స్పష్టతపై మెళకువలు నేర్పారని సమాచారం. పాత దూకుడును తగ్గించకుండానే, ఏ బంతిని ఎలా ఆడాలో అనే విషయంలో మరింత పక్వత సాధించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం అని టాక్.
READ ALSO: Train Accident: ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు..
నెట్స్లో మూడున్నర గంటల ‘తపస్సు’..
చెన్నైలోని భారత్ అరుణ్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆయన కసి ఏంటో అర్థమవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5:20 వరకు విరామం లేకుండా బ్యాటింగ్ చేశాడు. పేసర్లు, స్పిన్నర్లను మార్చి మార్చి ఆడుతూ వారిని అలసిపోయేలా చేశాడు. అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూజనర్ పర్యవేక్షణలో వైడ్ యార్కర్లను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. గతంలో రిస్క్ తీసుకుని అవుట్ అయిన సందర్భాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా షాట్లు కొడుతున్నాడు పంత్.
పంత్కు ఈ ఐపీఎల్ ఎందుకు కీలకం?
టెస్ట్ క్రికెట్లో టీమిండియా నంబర్ 1 కీపర్గా ఉన్నప్పటికీ, వైట్-బాల్ క్రికెట్లో పంత్ స్థానం కాస్త సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ఇషాన్ కిషన్, సంజు శామ్సన్ అద్భుతమైన ఫామ్లో ఉండటం, వన్డేల్లో కె.ఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ కీపర్గా ఉండటంతో పంత్ రిజర్వ్ బెంచ్కే పరిమితమవుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో రూ.27 కోట్ల భారీ ధర దక్కించుకున్నా.. కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు పంత్. ఈ నేపథ్యంలో, ఈ ఐపీఎల్ సీజన్లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ఒక సువర్ణావకాశంగా వినియోగించుకోవాలని పంత్కు ఆశిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో లాగా కేవలం కష్టపడటమే కాకుండా, ఇప్పుడు సొహమ్ దేశాయ్ వంటి నిపుణుల పర్యవేక్షణలో ‘స్మార్ట్ ఫిట్నెస్’పై దృష్టి పెట్టాడు రిషబ్. “పిచ్చివాడిలా కాకుండా, శరీరానికి ఏది అవసరమో అదే చేయాలి” అనే సూత్రంతో పంత్ తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రిషబ్ పంత్ ఆటలో ఇప్పుడు మునుపటి మెరుపుతో పాటు ఒక రకమైన నిలకడ కనిపిస్తోందని, అలసిపోయినా.. పరుగుల కోసం ఆకలితో ఉన్న సింహంలా కనిపిస్తున్న పంత్, ఈ ఐపీఎల్లో లక్నోను ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!