ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 9వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురు కూడా ‘కొరియన్ లవ్ గేమ్’కు బానిసై ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘అమ్మా.. పాపా.. క్షమించండి.’ అంటూ ఒక సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గదిలో అనేక రకమైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చేతన్ కుమార్.. ఫారెక్స్ వ్యాపారవేత్త. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్కి చెందిన ఇద్దరు సోదరీమణులు కూడా ఇతనితోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లోని సాహిబాబాద్ ప్రాంతంలోని భారత్ సిటీలో నివాసం ఉంటున్నారు.
అయితే కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. దాదాపు చేతన్ కుమార్కు రూ.2 కోట్ల అప్పు ఉంది. దీంతో ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో పిల్లల చదువు నిలిచిపోయింది. లాక్డౌన్ దగ్గర నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే బందీ అయిపోయారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఇంట్లో అంతంత మాత్రంగానే ఉంటున్నారు. కుటుంబ సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్కు బానిసైపోయారు. ‘కొరియన్ లవ్ గేమ్’కు ముగ్ధులైపోయారు. వారి పేర్లు కూడా కొరియన్ పేర్లు పెట్టుకున్నారు అంటే వారు ఎంతగా బానిస అయ్యారో అర్థమవుతోంది. ఈ క్రమంలో 10 రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్ను తీసుకుని చేతన్ కుమార్ దాచిపెట్టేశాడు. అంతేకాకుండా ఆ ఫోన్లు అమ్మేసి.. ఆ డబ్బుతో విద్యుత్ బిల్లు రూ.800 చెల్లించాడు. దీంతో కుమార్తెలు మానసికంగా కుంగిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై కొరియన్ లవ్ గేమ్ ఆడలేకపోతున్నామని మనో చింతకు లోనయ్యారు. ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
మొత్తానికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12) తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తమ బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి.’’ అంటూ ఒక సూసైడ్ నోట్ను రాసి తెల్లవారుజామున 2:15 నిమిషాలకు ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
డీజీపీ..
ఆన్లైన్ వ్యసనం యువ మనసులపై తీవ్ర ప్రభావం చూపించిందని ఉత్తరప్రదేశ్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజీవ్ కృష్ణ వెల్లడించారు. ఆన్లైన్ వ్యసనానికి బానిసలైన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిరంతరం మొబైల్స్తోనే గడిపినట్లుగా తేలిందన్నారు. బాలికలకు సరైన విద్య లేదని… ఈ క్రమంలోనే మొబైల్కు బానిసలైనట్లు తెలిపారు.