అతడు కనిపించినప్పుడల్లా ప్రజలు గౌరవంతో నిలబడేవారు. మెరిసే దుస్తులు… గంభీర స్వరం.. చేతిలో ఫోన్.. మాటల్లో అధికార ధాటి నేను ఢిల్లీ ఎన్ఐఏలో ఐపీఎస్ ఆఫీసర్.. అని చెప్పగానే ఎదుటివారు నమ్మక తప్పేది కాదు. ఇంకేముంది ఆ నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకోవాలని స్కెచ్ వేస్తూ తిరుపతిలో వరుసగా మోసాలకు పాల్పడుతున్న నకిలి ఐపీఎస్ అధికారిని అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. పరిచయమైన క్షణాల్లో మాటలు కలపడం వెంటనే ఆఫర్లు ఇవ్వడం అలవాటుగా చేసుకున్న అతగాడు తాజాగా ఓ రాపిడో డ్రైవర్ను మోసం చేసి దొరికిపోయాడు. అధికార హోదా పేరు చెప్పగానే ప్రజలు నమ్ముతారనే బలహీనతను ఆసరాగా తీసుకుని ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు తిరుపతిలో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..NIAలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకుంటూ తిరిగిన కె. సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు..
Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
నిందితుడు తనను తాను ఉన్నతాధికారిగా చూపించుకునేందుకు ప్రత్యేకంగా దుస్తులు, మాట్లాడే తీరు, అధికార ధోరణి అన్నింటినీ అలవాటు చేసుకున్నాడు. కేంద్ర సంస్థల్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించగలనని చెప్పి బాధితులను నమ్మించేవాడు. ఇదే తరహాలో ఒక రాపిడో డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుని ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితుడు రూ.1.50 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. డబ్బులు అందుకున్న తర్వాత సురేష్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు. పలుమార్లు సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో బాధితుడికి అనుమానం కలిగి అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాల్ డేటా, మొబైల్ లొకేషన్ వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడి కదలికలను గుర్తించారు. ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి నిఘా పెట్టి చివరకు సురేష్ కుమార్ అలియాస్ సూర్యను అరెస్టు చేశారు. నిందితుడు ఒంటరిగా పనిచేశాడా? లేక మరెవరైనా సహచరులు ఉన్నారా? ఇప్పటికే ఇలాంటి మోసాలు ఎక్కడైనా చేశాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతడి ఫోన్, బ్యాంక్ లావాదేవీలు, పరిచయ వర్గం అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ప్రభుత్వ నియామకాలు ఎప్పుడూ అధికారిక ప్రక్రియ ద్వారానే జరుగుతాయని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు…
Parijatha Yogam 2026: రేపే పారిజాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు.!