Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ… ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.
READ MORE: Kajal : కాజల్ కొత్త అవతారం.. రైతుల కోసం పోరాటం!
సరదాగా పిల్లలు ఆడుకుంటుండగా… ఒకరిని ఒకరు కొట్టుకోవడం కామన్ !! ఇంట్లోకి వెళ్లి.. తల్లికో, తండ్రికో ఏడుస్తూ చెప్పడమూ కామనే !! కానీ.. ఇక్కడ ఇద్దరు పిల్లలు పెట్టుకున్న పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పిల్లల గొడవలోకి పెద్దలు తలదూర్చారు. వీధికెక్కి స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారు. ఒకర్నొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి.. ఘట్కేసర్ పరిధిలోని ఔషాపూర్కి చెందిన అమీర్, అలీ ఇద్దరిళ్లూ పక్కపక్కనే !! వీళ్లిద్దరి పిల్లలు ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఇద్దరూ ఒకర్నొకరు తిట్టుకుంటూ గొడవ పడ్డారు. గమనించిన అమీర్… తన కొడుకుతోపాటు అలీ కొడుకును కూడా మందలించాడు. ఆటలాపేసి ఇంట్లోకి వెళ్లమని గట్టిగా కేకలు వేశాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిన అలీ కొడుకు… తండ్రి అలీకి విషయం చెప్పాడు. అమీర్ కొడుకు తనను కొట్టాడని… అమీర్ కూడా తనను మందలించాడని ఏడుస్తూ చెప్పాడు. కొడుకు బాధపడటాన్ని చూసి తట్టుకోలేని అలీ… వెంటనే అమీర్ ఇంటికి పరుగులు పెట్టాడు. నా కొడుకును మందలించడానికి నువ్వెవడు.. అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. బయటకు వచ్చిన అమీర్ను బూతులు తిట్టాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అమీర్ కుటుంబసభ్యులు, అలీ కుటుంబసభ్యులు కలగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. స్థానికులు కూడా ఇద్దరినీ… ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయేలా చేశారు..
READ MORE: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు 18 కండీషన్లు..!
అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో.. ఇంట్లోకి వచ్చిన 5 నిమిషాలలోసే అమీర్.. కిందపడిపోయాడు. తనకు ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. స్పందించిన అమీర్ కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. అమీర్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే.. మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలీ చేసిన దాడివల్లే అమీర్ చనిపోయాడంటూ అమీర్ బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతదేహంతో ఆందోళనకు దిగారు. అమీర్ మృతిచెందిన విషయమం తెలుసుకున్న అలీ.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు..