A Boy Commits Suicide In Warangal For Torturing Him In Police Station: వరంగల్ జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక.. ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. చేయని దొంగతనాన్ని తనపై మోపి, నేరాన్ని అంగీకరించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే.. ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గీసుగొండ మండలం వంచనగిరిలో ఉంటోన్న వంశీ (21) అనే యువకుడి బంధువులు, తమ ఇంట్లో ఉన్న 5 తులాల బంగారాన్ని వంశీ దొంగతనం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ నిమిత్తం పోలీసులు వంశీని పోలీస్ స్టేషన్కి పిలిపించారు.
Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
తాను ఈ దొంగతనం చేయలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని వంశీ పేర్కొన్నాడు. కానీ.. పోలీసులు అతని మాటల్ని పట్టించుకోలేదు. నువ్వే దొంగతనం చేశాడంటూ వేధించడం మొదలుపెట్టారు. తాను చోరీ చేయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినలేదు. ఇలా ఐదు రోజులపాటు వంశీని పీఎస్కి పిలిచి విచారించారు. ఈ చోరీతో తనకు సంబంధం లేదని తెలిపినా సరే.. ‘‘దొంగతనం చేసింది నువ్వే, నేరాన్ని ఒప్పుకొని తీరాల్సిందే’’ అంటూ టార్చర్ పెట్టారు. అంతేకాదు.. తీవ్రంగా కొట్టారు కూడా! దీంతో చేయని నేరానికి తనను కొట్టారన్న మనస్తాపంతో.. పోలీసుల ముందే వంశీ పురుగుల మందు తాగేశాడు. దాంతో.. పోలీసులు హుటాహుటిన అతడ్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నప్పుడు వంశీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు.
Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
చేతికి అందివచ్చిన అబ్బాయి ఇలా చనిపోవడంతో.. వంశీ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు పెట్టిన వేధింపుల వల్లే వంశీ మృతి చెందడంతో.. వాళ్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించుకునేదే లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చేయని తప్పుకి వంశీని బలి తీసుకున్న పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.