ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి.
Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్
ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి మరో 20 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని పెంచాలని సౌదీ చేసిన డిమాండ్కు ఒపెక్ సభ్యదేశమైన యూఏఈ అంగీకరించినా, 2022లోనూ ఆంక్షలు కొనసాగించాలనే డిమాండ్కు నో చెప్పింది. సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. యూఏఈ అంగీకారం లేకుండా ఆంక్షలు విధించలేమని సౌదీ చెబుతున్నది. చమురు ఉత్పత్తిపై ఏకాభిప్రాయం రాకుంటే, ఉత్పత్తి దేశాలు ఎవరికి తోచిన విధంగా వారు చమురును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ధరలు కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. దీంతో చమురు సంక్షోభం రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.