జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ప్రస్తుతం వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉండగా.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది 2.5 శాతం పెరిగి రూ. 3,075 కానుంది. రహదారుల నిర్వహణ , టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ పెంపును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పటికీ పాత ధరకే అంటే రూ. 3,000కే పాస్ను పొందాలనుకునే వాహనదారులు.. ఈ నెలాఖరు (మార్చి 31) లోపు రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు.
Also Read:Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
ఈ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ ఒక సంవత్సరం కాలపరిమితి వరకు ఉంటుంది లేదా గరిష్టంగా 200 టోల్ ప్లాజాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పూర్తికాక ముందే 200 టోల్ ప్లాజాలను దాటితే.. పాస్ గడువు ముగిసినట్లుగా పరిగణించబడుతుంది. టోల్ గేట్ల వద్ద ఆగకుండా.. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 52 లక్షల మందికి పైగా వాహనదారులు దీనిని వినియోగించుకుంటున్నారు.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
పాస్ పొందడం ఎలా..?
మీ వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉన్నట్లయితే, మీరు సులభంగా యాన్యువల్ పాస్ పొందవచ్చు. ముందుగా NHAI అధికారిక పోర్టల్లోకి లేదా మీ ఫాస్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ యాప్లోకి లాగిన్ అవ్వండి. ‘యాన్యువల్ పాస్’ ఆప్షన్ను ఎంచుకుని.. ఆన్లైన్ పేమెంట్ ద్వారా నిర్ణీత ఫీజును చెల్లించండి. చెల్లింపు పూర్తయ్యాక, పాస్ మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లను అమలు చేయాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. వీలైనంత త్వరగా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు.