సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తూ.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
అల్లు అర్జున్ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. దాడి ఘటనపై అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదుని జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. దాడి జరిగిన అంశంపై ఇంట్లో ఉన్న వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. ఈ క్రమంలో.. సెక్యూరిటీ సూపర్వైజర్ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు పోలీసులు.
కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో అల్లు అర్జున్ పై ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసిందని అన్నారు. ఆయన సినిమా వల్ల ఓ మహిళ చనిపోతే 25 లక్షల రూపాయలు బిక్షం వేస్తున్నారా...? అని పేర్కొన్నారు. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? ప్రశ్నించారు. అల్లు అర్జున్ కొడుకు చనిపోతే రూ.25 లక్షలు ఇస్తే ఊరుకుంటాడా..? అని అన్నారు.
హైదరాబాద్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్.. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను వివరించారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్హెచ్వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ పేర్కొన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. 2024వ సంవత్సరం చాలా ప్రశాంతంగా గడిచింది.. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా ముగిసాయని తెలిపారు. హోంగార్డ్ నుండి సీపీ వరకు అందరూ కష్టపడ్డారు.. అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేసామని తెలిపారు.
హీరో అల్లు అర్జున్ పై సస్పెన్షన్కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు.