MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వారంలో మూడు సార్లు కుటుంబ సభ్యులతో.. మరో 3 సార్లు లాయర్లతో ములాఖాత్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Also:
HHVM : వీరమల్లు అందుకే లేట్ అయింది.. పవన్ క్లారిటీ..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటి భోజనం రోజుకు ఒకసారి తీసుకు రావచ్చునని విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, మిథున్ రెడ్డికి వెస్ట్రన్ కమోడ్ తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక అటెండర్, తనకు అవసరమైన మందులు, టెలివిజన్, పెన్ను, పేపర్ లాంటి సౌకర్యాలను కల్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశాల్లో వెల్లడించింది. అయితే, ఈ ఉత్తర్వులు మిథున్ రెడ్డి తరఫున కోర్టును ఆశ్రయించిన పిటిషన్కి సంబంధించినవి కావడం గమనార్హం.
మరోవైపు, ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మిథున్ రెడ్డి రిమాండ్ కి వచ్చిన తరువాత మాజీమంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మొదటి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని జైలులో ఒక ప్రజాప్రతినిధిగా పరిగణించే పరిస్థితి కనపడటం లేదన్నారు. ఒక సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నారని, కల్పించాల్సిన సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. మిథున్ రెడ్డి సర్వైకల్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు.. అతడికి జైలు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. టీవీ, న్యూస్ పేపర్, సదుపాయం కల్పించలేదన్నారు. వై కేటగిరి భద్రతలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధిని ఈ రకంగా ట్రీట్ చేయడం సరికాదని ఆరోపించారు.